కోహ్లీ పంత్ హాఫ్ సెంచరీలు
గత మ్యాచ్లతో పోలిస్తే.. కరీబియన్ల నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. తుదికంటా పోరాడిన టీమ్ఇండియానే విజయం వరించింది. మొదట బ్యాటింగ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అర్ధశతకాలతో కదం తొక్కడంతో భారీ స్కోరు చేసిన రోహిత్ సేన ఆనక బౌలింగ్లోనూ క్రమశిక్షణ కనబర్చి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. వన్డే సిరీస్లో వైట్వాష్కు గురైన విండీస్.. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లోనూ అదే ప్రమాదంలో పడింది!
కోల్కతా: ఉత్కంఠ భరిత పోరులో ఒత్తిడిని జయించిన టీమ్ఇండియా విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో పోరులో భారత జట్టు 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ పర్యటనలో తొలిసారి కాస్త ప్రతిఘటన కనబర్చిన విండీస్ జట్టు.. చివరి వరకు అదే జోరు కనబర్చడంలో విఫలమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో రెండింటిని నెగ్గిన టీమ్ఇండియా 2-0తో సిరీస్ చేజిక్కించుకోగా.. వన్డే సిరీస్లో వైట్ వాష్కు గురైన కరీబియన్లు.. పొట్టి ఫార్మాట్లోనూ ఆ ప్రమాదం అంచున నిలిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (28 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడాడు. చాన్నాళ్లుగా ఫామ్లేమితో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. క్రీజులో అడుగుపెట్టడమే తరువాయి వరుస బౌండ్రీలతో అభిమానులను అలరించాడు. కొలతేసినట్లు మైదానం నలువైపులా ఫోర్లు కొట్టాడు. పొట్టి ఫార్మాట్లో కోహ్లీకి ఇది 30వ అర్ధశతకం కాగా.. గతేడాది టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై చేసిన ఫిఫ్టీ తర్వాత ఇదే మొదటిది. మంచి టచ్లో కనిపించిన విరాట్.. హాఫ్సెంచరీ తర్వాత చేజ్కు చిక్కాడు. ఈ దశలో పంత్, వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించారు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు కొడుతూ.. స్కోరు బోర్డును నడిపించారు. ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డ పంత్ కూడా అర్ధశతకం తన పేరిట రాసుకున్నాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులకు పరిమితమైంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పది కోట్లకు పైగా పెట్టి సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకున్న నికోలస్ పూరన్ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. రావ్మన్ పావెల్ (36 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీశారు. పంత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 ఆదివారం ఇక్కడే జరుగనుంది.
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (సి) బ్రాండన్ (బి) చేజ్ 19, ఇషాన్ (సి) మయేర్స్ (బి) కాట్రెల్ 2, కోహ్లీ (బి) చేజ్ 52, సూర్యకుమార్ (సి అండ్ బి) చేజ్ 8, పంత్ (నాటౌట్) 52, వెంకటేశ్ (బి) షెఫర్డ్ 33, హర్షల్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 19, మొత్తం: 20 ఓవర్లలో 186/5. వికెట్ల పతనం: 1-10, 2-59, 3-72, 4-106, 5-182, బౌలింగ్: అకీల్ 4-0-30-0, కాట్రెల్ 3-1-20-1, హోల్డర్ 4-0-45-0, షెఫర్డ్ 3-0-34-1, చేజ్ 4-0-25-3, స్మిత్ 1-0-10-0, పొలార్డ్ 1-0-14-0.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్ (సి) సూర్యకుమార్ (బి) రవి 22, మయేర్స్ (సి అండ్ బి) చాహల్ 9, పూరన్ (సి) రవి (బి) భువనేశ్వర్ 62, పావెల్ (నాటౌట్) 68, పొలార్డ్ (నాటౌట్) 3, ఎక్స్ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 178/3, వికెట్ల పతనం: 1-34, 2-59, 3-159, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-29-1, దీపక్ చాహర్ 4-0-40-0, చాహల్ 4-0-31-1, హర్షల్ 4-0-46-0, రవి బిష్ణోయ్ 4-0-30-1.