Asian Games 2023 | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. రోయింగ్తో మొదలైన మోతను.. షూటర్లు మరో స్థాయికి తీసుకెళ్లగా.. శుక్రవారం నుంచి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో అథ్లెటిక్స్ తరఫున దేశానికి కిరణ్ బలియాన్ తొలి పతకం అందించింది. మహిళల షాట్ పుట్లో కిరణ్ బలియాన్.. ఇనుప గుండును 17.36 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన గాంగ్ లిజావో 19.58 మీటర్లతో స్వర్ణం గెలుచుకోగా.. సాంగ్ జియాన్ 18.92 మీటర్లతో రజతం కైవసం చేసుకుంది. దీంతో 19వ ఏషియన్ గేమ్స్ లో భారత్ పతకాల ఖాతా 33కు చేరింది. ఇదే విభాగంలో పోటీ పడ్డ మరో భారత అథ్లెట్ మన్ ప్రీత్ కౌర్ గుండును 16.25 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్లో భారత్కు 20 పతకాలు రాగా.. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా భారత అథ్లెట్లు ఏషియన్ గేమ్స్ బరిలో దిగారు.
తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో దుమ్మురేపుతున్నది. ప్రత్యర్థులకు కనీస అవకాశం ఇవ్వకుండా.. చెలరేగిపోతున్న నిఖత్ ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం నిఖత్ జోర్డాన్ బాక్సర్ నాసర్ హనన్పై గెలుపొందింది. నిఖత్ పంచ్ల ధాటికి ప్రత్యర్థి తాలలేకపోవడంతో.. మూడు నిమిషాలకు ముందే రిఫరీ మ్యాచ్ను నిలిపి వేసి తెలంగాణ బాక్సర్ను విజేతగా ప్రకటించాడు. దీంతో సెమీఫైనల్లో అడుగు పెట్టడం ద్వారా ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసుకోవడంతో పాటు.. వచ్చే ఏడాది పారిస్లో జరగనున్న ఒలింపిక్స్కు నిఖత్ అర్హత సాధించింది. నిరుడు కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన నిజామాబాద్ బాక్సర్.. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. వరుసగా రెండేండ్లు ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం నెగ్గిన విషయం తెలిసిందే.