బెనోని (దక్షిణాఫ్రికా): తొలిసారి జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు దుమ్ము రేపుతున్నది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన యంగ్ఇండియా.. సూపర్ సిక్స్కు అర్హత సాధించింది. గ్రూప్-‘డి’లో భాగంగా తొలి మ్యాచ్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన షఫాలీ బృందం.. సోమవారం జరిగిన పోరులో 122 పరుగుల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 78; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. గత మ్యాచ్లో రాణించిన శ్వేత షెరావత్ (49 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు), రిచా ఘోష్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష 5 బంతుల్లో 11 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 97 పరుగులకు పరిమితమైంది. మన బౌలర్ల ధాటికి యూఏఈ అమ్మాయిలు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఆంధ్ర అమ్మాయి షబ్నమ్ ఒక వికెట్ పడగొట్టింది.