న్యూఢిల్లీ: వ్యక్తిగత విజయాలు ఎన్ని ఉన్నా.. జట్టుగా సాధించిన థామస్ కప్ గెలుపు ప్రపంచంలో భారత్ను బ్యాడ్మింటన్ సూపర్ పవర్గా నిలబెట్టిందని దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనె తెలిపాడు. ఇటీవల ముగిసిన థామస్ కప్లో అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన టీమ్ఇండియా.. తుదిపోరులో 14 సార్లు చాంపియన్ ఇండోనేషియాను చిత్తు చేసి తొలిసారి టైటిల్ పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘ఇది ఇంత త్వరగా సాధ్యమవుతుందని ఊహించలేదు.
దీని కోసం మరో పదేండ్లు ఎదురుచూడాలేమో అనుకున్నా. ఇక నుంచి భారత్ను సూపర్ పవర్గా పరిగణించాలి. థామస్ కప్ విజయం దేశంలో బ్యాడ్మింటన్కు ఫుల్ జోష్నిచ్చింది. ఎందరో యువ క్రీడాకారులు బ్యాడ్మింటన్ను కెరీర్గా ఎంచుకునేందుకు ఈ విజయం దోహదపడుతుంది. ఇది సమిష్టి కృషికి దక్కిన అత్యుత్తమ ఫలితం. వ్యక్తిగత పతకాల కన్నా ఎంతో గొప్పది. ఈ జోరు ఇలాగే కొనసాగించాలి. నిలకడ కనబరిస్తేనే ప్రపంచ దేశాలు భారత్ను కఠిన ప్రత్యర్థిగా పరిగణిస్తాయి’ అని పేర్కొన్నాడు.