గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును ఆడేందుకు ఎడ్జబాస్టన్ చేరుకున్న టీమిండియా ఈసారి కొత్త ఇంగ్లండ్ జట్టును చూస్తుందని.. ప్రత్యర్థి ఎవరైనా తమ దూకుడు మాత్రం తగ్గదని అంటున్నాడు ఆ జట్టు నయా టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను 3-0తో క్వీన్ స్వీప్ చేసిన ఈ కొత్త సారథి.. భారత్ తో గతేడాది ఆడిన జట్టుకు ఇప్పటి జట్టుకు చాలా తేడా ఉందని.. ఈసారి టీమిండియాకు తిప్పలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఐదో టెస్టు ప్రారంభానికి ముందు స్టోక్స్ మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ తో మేము ఏ మైండ్ సెట్ తో ఆడామో ఇండియాతో కూడా అదే దూకుడును కొనసాగిస్తాం. ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. కానీ మా ఆటతీరులో మార్పు ఉండదు. ఇండియా త్వరలో ఎదుర్కోబోయేది కొత్త ఇంగ్లండ్ జట్టు..
నేను కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫలితాల కంటే టీమ్ మైండ్ సెట్ ను మార్చాను. టెస్టు క్రికెట్ పట్ల కుర్రాళ్ల ఆలోచన మార్చడం, మీరు మీ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు దానిని మనసారా ఆస్వాదించాలని గురించి నేను నా సహచరులతో చెప్పాను. ఫలితాల సంగతి తర్వాత.. అయితే ఆ మైండ్ సెట్ ను మేము చాలా త్వరగా ఆకలింపు చేసుకున్నందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. మూడో టెస్టులో 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పుడు మేము చేయగలిగినది, చేసిన విధానం సిరీస్ లో అత్యంత ఆనందకరమైన విషయం…’ అని అన్నాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ గా న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు ఎంపికైన స్టోక్స్ జట్టు దృక్పథాన్ని మార్చాడు. ముఖ్యంగా బెయిర్ స్టో ఆట ఈ టెస్టు సిరీస్ అంతటికీ హైలైట్. అసాధ్యమనుకున్నదాన్ని పలుమార్లు సాధ్యం చేసి చూపాడు ఈ విధ్వంసక బ్యాటర్. టెస్టు క్రికెట్ లో టీ20 ఆటను ఆడుతూ దాదాపు రెండు టెస్టులలో కివీస్ విజయావకాశాలను దెబ్బతీశాడు. రూట్ ఎప్పటిలాగే తన ఫామ్ ను కొనసాగించాడు. వీరితో పాటు బెన్ ఫోక్స్, ఓలి పోప్, స్టోక్స్ లు కివీస్ తో సిరీస్ లో ఆడిన ఆటనే ఇక్కడే రిపీట్ చేస్తే మాత్రం భారత జట్టుకు కష్టాలు తప్పవు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.