IND vs WI | గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లలో రన్నరప్తో సరిపెట్టుకున్న టీమ్ఇండియా.. 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి వెస్టిండీస్తో రోహిత్ సేన తొలి టెస్టు ఆడనుంది. అటు కుర్రాళ్లు, ఇటు యువరక్తంతో నిండి ఉన్న భారత జట్టుకు.. అనుభవలేమితో కూడి ఉన్న వెస్టిండీస్ ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి!
డొమినికా: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై నెల రోజుల విశ్రాంతి అనంతరం భారత జట్టు తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్ టూర్లో భాగంగా బుధవారం నుంచి భారత్ తొలి టెస్టు ఆడనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే చతేశ్వర్ పుజారాపై వేటు పడటంతో అతడి స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తొలి సారి టెస్టు జట్టుకు ఎంపిక కాగా.. వీరిలో యశస్వికి తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత అజింక్యా రహానే బ్యాటింగ్కు రానున్నారు. వికెట్ కీపర్గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్తో ఇషాన్ కిషన్ పోటీపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో బరిలోకి దిగిన భరత్ వికెట్ల వెనుక అదుర్స్ అనిపించుకున్నా.. బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే మరోసారి భరత్పైనే విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండర్ల కోటాలో చోటు దక్కించుకోనుండగా.. ప్రధాన పేసర్ హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్తో పాటు కొత్త బంతిని పంచుకునేది ఎవరో తేలాల్సి ఉంది. నవ్దీప్ సైనీ, జైదేవ్ ఉనాద్కట్, ముఖేశ్ కుమార్.. ఈ ప్లేస్ కోసం పోటీపడుతుండగా.. వీరిలో టీమ్ మేనేజ్మెంట్ ముఖేశ్ వైపు మొగ్గుచూపేలా ఉంది. మరోవైపు తొలి టెస్టు కోసం వెస్టిండీస్ 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఎక్కువ శాతం కొత్త ప్లేయర్లకు అవకాశం దక్కింది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, యశస్వి, కోహ్లీ, రహానే, భరత్, జడేజా, అశ్విన్, శార్దూల్, సిరాజ్, ముఖేశ్.
వెస్టిండీస్: బ్రాత్వైట్ (కెప్టెన్), టగ్నరైన్ చందర్పాల్, రైమాన్, బ్లాక్వుడ్, చేజ్, జోషువా, రాకీమ్ కార్న్వాల్, హోల్డర్, గాబ్రియల్, అల్జారీ జోసెఫ్, కిమారో రోచ్.