IND vs SL : కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మాస్టర్ కార్డు రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకుంది.కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో (64) జట్టును గెలిపించాడు. హార్దిక్ పాండ్యా (32). శ్రేయాస్ అయ్యర్(28), అక్షర్ పటేల్ 21తో రాణించారు. రజిత వేసిన 43వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన రాహుల్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. 43వ ఓవర్ రెండో బంతికి కుల్దీప్ యాదవ్ విన్నింగ్ షాట్ కొట్టాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైన రాహుల్ ఈ మ్యాచ్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్కు అర్థ సెంచరీ (73) భాగస్వామ్యం నిర్మించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ లంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచాడు. నాటౌట్గా నిలిచి భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురంలో జరగనుంది.
86 పరుగులకే నాలుగు వికెట్లు
216 టార్గెట్.. ఫామ్లో ఉన్న కోహ్లీ, అర్థ శతకాలతో రాణించిన రోహిత్, శుభ్మన్ గిల్.. ఇంకేముందు 40 ఓవర్ల లోపే భారత్ మ్యాచ్ ముగిస్తుంది అనుకున్నారంతా. కానీ, శ్రీలంక బౌలర్లు 86 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు తీసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఓపెనర్లు రోహిత్ , గిల్తో పాటు కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. దాంతో, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 75 పరుగులు జోడించారు. హార్ధిక్ అవుట్ అయ్యాక అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్తో కలిసి రాహుల్ జట్టును గెలిపించాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, కరుణరత్నే రెండు వికెట్లు తీశారు. కసిన్ రజిత, ధనంజయ డిసిల్వాకు ఒక్కో వికెట్ దక్కింది.
ఆదుకున్న నువనిదు ఫెర్నాండో
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 40 ఓవర్లలో 215 పరుగులు ఆలౌట్ అయింది. ఓపెనర్ నువనిదు ఫెర్నాండో (50) అర్థ శతకంతో జట్టును ఆదుకున్నాడు. కుశాల్ మెండిస్ (34), అసలంక (15), మొదటి వన్డేలో సెంచరీ చేసిన దసున్ షనక (2) విఫలమయ్యారు. లంక పోరాడగలిగేంత స్కోర్ చేసిందంటే.. అది టెయిలెండర్ల చలవే.. వెల్లలాగే (32), వనిందు హసరంగ (21), చమిక కరుణరత్నే(17) రాణించడంతో ఆ జట్టు రెండొందలకు పైగా పరుగులు చేయగలిగింది. సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్కు రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.