వాండరర్స్ వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య పోరు రసపట్టులో పడింది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యఛేదనలో రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలు విజయానికి 122 పరుగుల దూరంలో ఉన్నారు. రెండు రోజులు మిగిలున్న ఆటలో.. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై గెలుపు ఎవరిదన్నది నేడు తేలనుంది. వాండరర్స్లో ఓటమి ఎరుగని టీమ్ఇండియా జయకేతనం ఎగురవేస్తుందా..లేక పోరాటాన్ని నమ్ముకున్న ప్రోటీస్ పుంజుకుని పోటీలోకి వస్తుందో చూడాలి.
జొహన్నెస్బర్గ్: ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికరపోరు సాగుతున్నది. పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో ఇరు జట్లు తుదికంటా తెగిస్తున్నాయి. వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన సఫారీలు ఆట ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్(46 నాటౌట్), డస్సెన్(11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా విజయానికి 122 పరుగుల దూరంలో ఉంది. శార్దూల్ ఠాకూర్(1/24), అశ్విన్(1/14) ఒక్కో వికెట్ తీశారు. పగుళ్లతో అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్ ఎవరికి లాభిస్తుందనేది గురువారం ఆటలో తొలి సెషన్లో తేలిపోనుంది. భారీ లక్ష్యం కాకపోయినా..మ్యాచ్ గడుస్తున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుండటం దక్షిణాఫ్రికాకు కలిసిరానుంది. మరోవైపు స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ పూర్తి ఫిట్నెస్తో లేకపోవడం టీమ్ఇండియా గెలుపు అవకాశాలపై ఒకింత ప్రభావం చూపించనుంది. అంతకుముందు ఓవర్నైట్స్కోరు 85/2 బుధవారం రెండో ఇన్నింగ్స్కు దిగిన భారత్..266 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్లు పుజార(53), రహానే(58) స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గత కొంత కాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న ఈ ఇద్దరు సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తమ శైలికి పూర్తి భిన్నంగా దూకుడు కనబరుస్తూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. రబాడ బౌలింగ్లో రహానే ఔట్ కావడంతో మూడో వికెట్కు 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రిషబ్పంత్(0) డకౌట్గా వెనుదిరుగగా, హైదరాబాదీ హనుమ విహారి(40 నాటౌట్) కడదాకా క్రీజులో ఉన్నాడు. శార్దూల్ ఠాకూర్(28), అశ్విన్(16)తో కలిసి విహారి విలువైన పరుగులు కొల్లగొట్టాడు. అయితే సఫారీ బౌలర్లు రబాడ(3/77), ఎంగ్డీ(3/43), జాన్సెన్(3/67) సమిష్టి ప్రదర్శనతో 111 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఆఖరి 8 వికెట్లు కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్:(ఎల్గర్ 46 నాటౌట్, పీటర్సన్ 38, శార్దూల్ 1/24, అశ్విన్ 1/14)