స్వదేశీ, విదేశీ పిచ్ అనే తేడా లేకుండా గత కొన్నాళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ బౌలింగ్ దళం ప్రతికూల పరిస్థితుల్లో కాస్త వెనకడుగు వేయడంతో వాండరర్స్లో టీమ్ఇండియాకు తొలి పరాజయం ఎదురైంది. వర్షం కారణంగా బ్యాటింగ్కు సహకరించిన పిచ్పై కెప్టెన్ డీన్ ఎల్గర్ అజేయ ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
జొహన్నెస్ బర్గ్: హోరాహోరీగా సాగిన పోరులో చివరకు దక్షిణాఫ్రికానే విజయం వరించింది. డీన్ ఎల్గర్ (188 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై గెలుపొందింది. భారీ వర్షం కారణంగా గురువారం రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోగా.. వరుణుడి విరామం అనంతరం పిచ్ బ్యాటింగ్కు సహకరించడంతో భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలువగా.. నిర్ణయాత్మక మూడో టెస్టు మంగళవారం నుంచి కేప్టౌన్ వేదికగా ప్రారంభం కానుంది. 240 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 118/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 67.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో పాటు ఔట్ ఫీల్డ్ వేగం పెరుగడంతో సఫారీలు సులువుగా పరుగులు రాబట్టారు. మంచి బంతులను గౌరవించిన ఎల్గర్, డసెన్ (40) జోడీ చెత్త బంతులపై విరుచుకుపడి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. మూడో వికెట్కు వీరిద్దరూ 82 పరుగులు జత చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. ఆఖర్లో బవుమా (23 నాటౌట్)తో కలిసి ఎల్గర్ మ్యాచ్ను ముగించాడు. భారత బౌలర్లలో అశ్విన్, షమీ, శార్దూల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న ఎల్గర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 202, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229, భారత్ రెండో ఇన్నింగ్స్: 266, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 243/3 (ఎల్గర్ 96 నాటౌట్, డసెన్ 40; అశ్విన్ 1/26)
జొహన్నెస్బర్గ్లో టీమ్ఇండియాకు ఇదే తొలి పరాజయం. గతంలో ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్ల్లో భారత్ రెండింట గెలిచి మూడింటిని ‘డ్రా’ చేసుకుంది.