భారత్ చావోరేవుకు సిద్ధమైంది. టీ20 సిరీస్ గెలిచిన ఊపులో వన్డేల్లోనూ దక్షిణాఫ్రికా భరతం పడుదామని చూసిన టీమ్ఇండియాకు లక్నోలో ఝలక్ తగిలింది. స్టార్ల గైర్హాజరీలో యువకుల మేళవింపుతో బరిలోకి దిగిన ధవన్సేన గెలుపు వాకిట బోర్లా పడింది. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలం కాగా, శ్రేయాస్, శాంసన్ మెరిసినా లాభం లేకపోయింది. రాంచీ పోరులో సఫారీల మెడలు వంచి సిరీస్లో నిలువాలన్న పట్టుదలతో టీమ్ఇండియా ఉంది. ఇక ఇదే జోరులో దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకునేందుకు ఆరాట పడుతున్నది. ఈ నేపథ్యంలోఆదివారం ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.
రాంచీ: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై సత్తాచాటాలని టీమ్ఇండియా చూస్తుంటే..టీ20 సిరీస్ ఓటమికి వన్డేల్లో ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీలు చూస్తున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన బృందం బయల్దేరి వెళ్లగా, ధవన్ నేతృత్వంలోని యంగ్ ఇండియా సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నది. సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎలాగైనా రాణించాలన్న పట్టుదలను కనబరుస్తున్నారు. లక్నో వన్డేలో కెప్టెన్ ధవన్, గిల్, ఇషాన్కిషన్, రుతురాజ్ గైక్వాడ్ విఫలం కాగా, శ్రేయాస్ అయ్యర్, శాంసన్ అద్భుత పోరాట పటిమ కనబరిచారు. జాతీయజట్టులోకి వస్తూ పోతున్న శాంసన్ సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అతడికి సరైన సహకారం దొరికితే లక్నో మ్యాచ్ మన చేతికి చిక్కేదే. బౌలింగ్ విషయానికొస్తే గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు యువ పేసర్ దీపక్ చాహర్ దూరమయ్యాడు. మెగాటోర్నీకి రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన చాహర్ స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్, అవేశ్ఖాన్ తీవ్ర నిరాశపరుస్తుండగా, యువ పేసర్ ముకేశ్కుమార్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జరిగితే సిరాజ్, అవేశ్ ఇద్దరిలో ఒకరి స్థానానికి ఎసరు వస్తుంది. కుల్దీప్ యాదవ్కు జోడీ బెంగాల్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్కు అరంగేట్రం అవకాశం దక్కవచ్చు.
సిరీస్పై సఫారీల గురి:
లక్నో వన్డే విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో రాంచీలో సిరీస్పై దక్షిణాఫ్రికా గురిపెట్టింది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్ కీలకమైన తరుణంలో దక్షిణాఫ్రికా..భారత్కు దీటుగా స్పందించే అవకాశముంది. లక్నోలో దాదాపు ఓడించినంత పనిచేసిన ద్వితీయ శ్రేణి భారత జట్టును ఎలాగైనా నిలువరించాలన్న కసి సఫారీల్లో కనిపిస్తున్నది. రిలీ రోసో, డేవిడ్ మిల్లర్ సూపర్ఫామ్ మీదుండటం సఫారీలకు కలిసి రానుంది. అయితే కెప్టెన్ బవుమా పేలవ ఫామ్ జట్టును కలవరపెడుతున్నది. గత నాలుగు మ్యాచ్ల్లో 0, 0, 3, 8 స్కోర్లకు పరిమితమైన బవు మా…మెగాటోర్నీ నాటికైనా ఫామ్లోకి వస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రబాడ నేతృత్వంలోని పేస్ దళం ..టీమ్ఇండియా బ్యాటింగ్కు పరీక్ష పెడుతున్నది.
చాహర్ స్థానంలో సుందర్
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముందు టీమ్ఇండియాను గాయాల బెడద బాధిస్తూనే ఉంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో మెగాటోర్నీకి దూరం కాగా తాజాగా దీపక్ చాహర్ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు వన్డేలకు అతడు అందుబాటులో ఉండటం లేదు. వెన్నుముక గాయంతో బాధపడుతున్న దీపక్ చాహర్ స్థానంలో యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు అవకాశం కల్పించారు. ఈ మేరకు శనివారం ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని వెలువరించింది.మెగాటోర్నీకి రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన చాహర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు.
జట్ల అంచనా
భారత్: ధవన్(కెప్టెన్), గిల్, రుతురాజ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, శాంసన్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్/షాబాజ్, అవేశ్ఖాన్, కుల్దీప్ యాదవ్, సిరాజ్
దక్షిణాఫ్రికా: బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, మలన్, మక్క్రామ్, క్లాసెన్, పార్నెల్/ఫెకుల్వాయో,కేశవ్ మహారాజ్, రబాడ,శంసీ/జాన్సెన్,నోర్టె, ఎంగ్డీ