Ind Vs SA | దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ‘డ్రా’చేసుకున్న టీమ్ఇండియా.. వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. నేడు నిర్ణయాత్మక పోరు జరుగనుంది. గత సఫారీ పర్యటనలో నిరాశ పరిచిన రాహుల్ సేన.. ఈసారి ఆ లోటు భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
పార్ల్: ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్కు ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు గురువారం మూడో వన్డే ఆడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో టీమ్ఇండియా విజయం సాధించగా.. రెండో వన్డేలో సత్తాచాటిన సఫారీలు సిరీస్ సమం చేశారు. దీంతో ఆఖరి పోరులో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఆఖరి వన్డే కీలకం కానుండగా.. మన బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఓపెనర్ సాయి సుదర్శన్ రెండు మ్యాచ్ల్లోనూ అర్ధశతకాలతో మంచి జోష్లో ఉండగా.. మరో ఓపెనర్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. కెరీర్ ఆరంభంలో చక్కటి ప్రదర్శన కనబర్చిన తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మపై ఒత్తిడి ఉండనుంది. రజత్ పాటిదార్కు అరంగేట్ర అవకాశం వస్తుందా చూడాలి.
మిడిలార్డర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు సంజూశాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో అర్ష్దీప్, అవేశ్, ముఖేశ్, కుల్దీప్ కీలకం కానున్నారు. మరోవైపు గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన దక్షిణాఫ్రికా నయా ఓపెనర్ జోర్జితో పాటు, మార్క్మ్,్ర హెన్రిక్స్, క్లాసెన్, మిల్లర్, డసెన్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు.