Ind Vs SA T20 | భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో పోరును దక్షిణాఫ్రికా ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగే మూడో టీ20లో గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమ్ఇండియా చూస్తుంటే.. సఫారీలు సొంతగడ్డపై సిరీస్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. మెగాటోర్నీకి ముందు మిగిలిన మ్యాచ్ల్లో సత్తాచాటడం ద్వారా జట్టులో చోటు నిలుపుకోవాలని ఇరు జట్ల ప్లేయర్లు కసితో ఉన్నారు. వరుణుడు అంతరాయం కల్గించే అవకాశం లేకపోవడంతో అభిమానులు పూర్తి మ్యాచ్ను ఆస్వాదించవచ్చు.
జొహాన్నెస్బర్గ్: భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరోమారు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గురువారం రెండు జట్ల మధ్య కీలకమైన మూడు టీ20 మ్యాచ్ జరుగనుంది. సఫారీలు ఇప్పటికే 1-0ఆధిక్యంలో ఉండగా, టీమ్ఇండియా కచిత్చంగా గెలిచి సిరీస్ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. వర్షం అంతరాయం మధ్య సాగిన రెండో పోరులో దక్షిణాఫ్రికా విజయం(డక్వర్త్ లూయిస్ పద్దతి)సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో మంచి జోష్తో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియాను వరుణుడు నీడలా వెంటాడు. తొలి మ్యాచ్ కనీసం ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా, రెండో పోరులో దక్షిణాఫ్రికాదే పైచేయి అయ్యింది. మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ చేజారకుండా సూర్యకుమార్ సేన ప్రయత్నించే అవకాశముంంది. మరోవైపు కొట్టిన పిండిల్లాంటి సొంత పిచ్లపై తమ ప్రతాపం చూపించేందుకు మార్క్మ్ కెప్టెన్సీలోని సఫారీలు కసితో కనిపిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్కు టీమ్ఇండియా మార్పులు, చేర్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ఆసీస్తో సిరీస్తో రాణించిన అక్షర్పటేల్, రవి బిష్ణోయ్ను పక్కకుపెట్టడంపై బీసీసీఐపై అభిమానులు సోషల్మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఫామ్మీద ఉన్నవాళ్లను ఆడించాల్సింది పోయి మిగతావారికి ఎలా అవకాశమిస్తారంటూ ప్రశ్నలతో కడిగేస్తున్నారు. అనారోగ్యంతో గత మ్యాచ్కు దూరమైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్..తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది. శుభ్మన్ గిల్ స్థానంలో రుతురాజ్కు చాన్స్ దక్కనుంది. మరోవైపు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్కు బదులుగా బిష్ణోయ్ తుది జట్టులోకి రావచ్చు. రెండో పోరులో పేసర్లు సిరాజ్, అర్ష్దీప్సింగ్, ముకేశ్కుమార్ తీవ్రంగా నిరాశపరిచారు. సఫారీ ఓపెనర్ రెజా హెండ్రిక్స్ వీరిని లక్ష్యంగా చేసుకుంటూ పరుగుల వరద పారించాడు. మూడో మ్యాచ్లోనూ ఇదే పునరావృతమైతే భారత్ సిరీస్ చేజార్చుకున్నట్లే
మూడో మ్యాచ్కు సఫారీ టీమ్..కొత్త ముఖాలతో పోటీకి దిగే అవకాశముంది. జాన్సెన్, కొట్జె స్థానాల్లో నాండ్రె బుర్గర్, ఒటినెల్ బార్ట్మన్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ కనిపిస్తున్నాయి. వీరికి తోడు ఆల్రౌండర్ ఫెరీరాకు అవకాశం దక్కవచ్చు.
భారత్: జైస్వాల్, రుతురాజ్/గిల్, తిలక్వర్మ, సూర్యకుమార్(కెప్టెన్), రింకూసింగ్, జితేశ్శర్మ, జడేజా, అర్ష్దీప్సింగ్, కుల్దీప్/బిష్ణోయ్, సిరాజ్, ముకేశ్కుమార్
దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్, బ్రిజ్కె, మార్క్మ్(్రకెప్టెన్), క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, ఫెరీరా, ఫెల్కువాయో, విలియమ్స్, బార్ట్మన్/బుర్గర్, శంసీ.