Asia Cup | ఊహించిందే నిజమైంది! దాయాదుల పోరుకు వరుణుడు అడ్డుపడతాడని అనుకున్నట్లే జరిగింది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య పోరు భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. నేడు రిజర్వ్ డే కావడంతో ఆట ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుంచే ప్రారంభం కానుంది.
వరుణుడి ప్రతాపానికి ముందు భారత ఓపెనర్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వీరంగమాడారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా విర్రవీగుతున్న పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని మనవాళ్లు నేలకు దించారు. శుభ్మన్ గిల్ ఆరంభం నుంచి అదరగొట్టగా.. కాసేపు నిధానంగా ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత దంచికొట్టాడు. ఇప్పటికే టీమ్ఇండియాకు శుభారంభం దక్కగా.. మిగిలిన వాళ్లు మరెన్ని పరుగులు చేస్తారో చూడాలి. నేడు కూడా మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగించే అంశం.
కొలంబో: ఓపెనర్లు రోహిత్ శర్మ (49 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (52 బంతుల్లో 58; 10 ఫోర్లు) అర్ధశతకాలతో చెలరేగడంతో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్ టీమ్ఇండియాకు మంచి ఆరంభం లభించింది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా దాయాదుల మధ్య సమరంలో ఈ సారి భారత్దే పైచేయి అయింది. లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థితో పోరులో భారత టాపార్డర్ నిరాశ పరచగా.. ఈ సారి మనవాళ్లు దంచికొట్టారు. ఓపెనర్లిద్దరూ అర్ధశతకాలతో అల్లాడించడంతో భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం అడ్డుపడింది. మధ్యలో కాస్త తెరిపినివ్వడంతో ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించగా.. కాసేపటికే మరోమారు వర్షం ముంచెత్తింది. దీంతో ఆట రిజర్వ్డేకు వెళ్లింది. ఆదివారం మ్యాచ్ ఆగిన చోటు నుంచి సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. గత మ్యాచ్లో భారత బ్యాటర్లను భయపెట్టిన పాక్ పేస్ త్రయం షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవుఫ్ను ఈసారి మనవాళ్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్ను లక్ష్యంగా చేసుకొని బౌండ్రీల మోత మోగించారు. ఫలితంగా తొలి మూడు ఓవర్లలోనే షాహీన్ 31 ఫోర్లు సమర్పించుకున్నాడు. అందులో ఏడు బౌండ్రీలు ఉండటం గమనార్హం. భారీ సిక్సర్తో రోహిత్ దంచుడు ప్రారంభిస్తే.. వరుస బౌండ్రీలతో గిల్ దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. శుభ్మన్ ధాటిగా ఆడుతుండటంతో అతడికే ఎక్కువ స్ట్రయిక్ ఇచ్చిన రోహిత్.. స్పిన్నర్ షాదాబ్ ఖాన్పై విరుచుకుపడ్డాడు. హిట్మ్యాన్ ధాటికి షాదాబ్ తొలి రెండు ఓవర్లలోనే 31 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే భారీ స్కోర్లు చేయడం ఖాయం అనుకున్న ఈ ఇద్దరు వరుస ఓవర్లలో ఔట్ కాగా.. విరాట్ కోహ్లీ (8 నాటౌట్), కేఎల్ రాహుల్ (17 నాటౌట్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాహీన్, షాదాబ్ చెరో వికెట్ పడగొట్టారు.
గాయం కారణంగా సుదీర్ఘ కాలం జట్టుకు దూరమై.. ఆసియా కప్ ద్వారానే పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్ మళ్లీ గాయపడ్డాడు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో ఈ మ్యాచ్లో మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్కు చాన్స్ దక్కింది.
మ్యాచ్కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ ఈ రోజు కూడా వర్షం పడే సూచన ఉండటం అభిమానులను ఆందోళన పరుస్తున్నది. కొలంబోలో సోమవారం కూడా భారీ వర్షం పడే సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.