లండన్: ఫుట్బాల్ వరల్డ్కప్ ఫైనల్పై అందరి దృష్టి ఉండగా.. క్రికెట్ అభిమానుల ఫోకస్ మాత్రం మరో మ్యాచ్పై ఉంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగే మూడో, చివరి వన్డేపై క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్లు నిలిపింది. హిట్మ్యాన్ భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ మ్యాచ్ అతడికి అత్యంత కీలకంగా మారింది. రోహిత్కు ఇది చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాదని బీసీసీఐ స్పష్టం చేసినప్పటికీ అతని ఆటతీరుపైనే అందరి దృష్టి ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన 39 ఏండ్ల రోహిత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడు ఆడగలడా అనే చర్చ మొదలైంది.
అయితే, లార్డ్స్ వికెట్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో రోహిత్ మళ్లీ ఫామ్లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక, కెప్టెన్ శుభ్మన్ గిల్ గత మ్యాచ్లో త్వరగానే ఔటైనప్పటికీ మంచి ఫామ్లోనే ఉన్నాడు. మరో వెటరన్ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో తన జోరును కొనసాగిస్తున్నాడు. గత మ్యాచ్లో సెంచరీ దిశగా సాగిన కోహ్లీ, ఆర్చర్కి వికెట్ ఇచ్చుకోవడం.. ఆ తర్వాత మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ మ్యాచ్ను చేజార్చుకుంది. భారత బ్యాటర్లు ఇప్పటికీ షార్ట్ పిచ్ బంతులకు తడబడుతున్నట్లు స్పష్టమైంది. ఈ బలహీనతను సరిదిద్దుకుంటేనే జట్టు చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోగలదు.