ఆశలు ఆవిరయ్యాయి.. కలలు కల్లలయ్యాయి.. పదిహేనేండ్ల క్రితం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచిన టీమ్ఇండియా.. మరోమారు కప్పు సాధించాలని కోరుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన ఓటమి పాలైంది. మొదట ఓపెనర్ల వైఫల్యంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన భారత్.. ఆనక బౌలింగ్లోనూ మ్యాజిక్ చేయలేకపోయింది. సమిష్టి వైఫల్యంతో సెమీస్ అడ్డంకి దాటలేక ఉసూరుమనిపించింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ వీరోచిత పోరాటాలతో సెమీఫైనల్ వరకు చేరిన రోహిత్ సేన.. అసలు సిసలు పోరులో తడబడింది. ఇక ఆదివారం జరుగనున్న ఆఖరి పోరులో పాకిస్థాన్, ఇంగ్లండ్ టైటిల్ కోసం తలపడనున్నాయి.
అడిలైడ్: భారత జట్టు రాత మారలేదు. టోర్నీ ఆసాంతం రాణించి.. కీలక తరుణంలో చేతులెత్తేసే అలవాటును టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగించిన టీమ్ఇండియా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. నిరుడు యూఏఈ వేదికగా జరిగిన వరల్డ్ కప్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన భారత్.. ఈ సారి సెమీస్లో ఇంటిబాట పట్టింది. కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఆసీస్లో అడుగుపెట్టిన రోహిత్ సేన గురువారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమ్ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు మరోసారి విఫలమవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది.
అడిలైడ్లో అద్భుత రికార్డు కొనసాగిస్తూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, ఒక సిక్సర్) మరో అర్ధశతకంతో చెలరేగగా.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ (5) నిరాశ పరచగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (28 బంతుల్లో 27) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఫుల్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (14) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో భారత జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (47 బంతుల్లో 86 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మన బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ పడగొట్టలేకపోయారు. హేల్స్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
1 అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయి దాటిన తొలి క్రికెటర్గా విరాట్ కోహ్లీ (4008) చరిత్రకెక్కాడు. రోహిత్ (3853), రెండో స్థానంలో ఉన్నాడు.
అక్కడే పోయింది..
ఫీల్డింగ్ నిబంధనలను అనుకూలంగా మార్చుకుంటూ.. పవర్ప్లేలో దంచికొట్టాల్సింది పోయి.. వికెట్లు కాపాడుకునే ధోరణిలో ఆడటమే టీమ్ఇండియా కొంపముంచింది. మనవాళ్లు ఒక్క బౌండ్రీ కొట్టేందుకు నానా తంటాలు పడుతుంటే.. ఇంగ్లండ్ ఓపెనర్లు క్రీజులో అడుగుపెట్టడంతోనే బాదుడే పరమావధిగా చెలరేగిపోయారు. పవర్ప్లేలో రోహిత్సేన 38 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ 63 రన్స్ రాబట్టింది. అక్కడే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ఇక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ఆటగాళ్లు.. రషీద్, లివింగ్స్టోన్ బౌలింగ్లో ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడటం గమనార్హం. ఈ ఇద్దరు కలిసి వేసిన 7 ఓవర్లలో 41 పరుగులే చేసిన టీమ్ఇండియా ఒక వికెట్ కోల్పోగా.. అశ్విన్, అక్షర్ కలిసి 6 ఓవర్లలోనే 57 పరుగులు సమర్పించుకున్నారు. తుది జట్టులో లెగ్స్పిన్నర్ లేకపోవడం కూడా ఇంగ్లండ్ ఓపెనర్లకు కలిసొచ్చింది. భారత ఇన్నింగ్స్లో 42 డాట్బాల్స్ (7 ఓవర్లు) నమోదు కావడంతో ఒత్తిడి అధికమైంది. ఆఖరి 4 ఓవర్లలో పాండ్యా జోరుతో 58 పరుగులు పిండుకున్నా.. ఇంగ్లండ్ ఓపెనర్ల ఊచకోత ముందు అది సరిపోలేదు. మన ఓపెనర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డ చోట.. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతల్లో చూపెట్టారు.
ఈ ఫలితంతో తీవ్ర నిరాశకు గురయ్యాం. చివర్లో బాగానే బ్యాటింగ్ చేయడంతో మెరుగైన స్కోరు చేయగలిగాం. కానీ బౌలింగ్ యూనిట్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడి అధిగమించడం ముఖ్యం. దీనిపై వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. మా జట్టు సభ్యులకు ఇలాంటి మ్యాచ్లు కొత్తకాదు. వీళ్లంతా ఐపీఎల్లో ఆడినవాళ్లే. బౌలింగ్లో సరైన ఆరంభం లభించలేదు. ఈ ఘనత ఇంగ్లండ్ ఓపెనర్లకే దక్కుతుంది.
– రోహిత్ శర్మ, భారత కెప్టెన్
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 168/6 (పాం డ్యా 63, కోహ్లీ 50; జోర్డాన్ 3/43), ఇంగ్లండ్: 16 ఓవర్లలో 170/0 (బట్లర్ 80 నాటౌట్, హేల్స్ 86 నాటౌట్).