అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగి తొలి టీ20లో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన టీమ్ఇండియా.. అదే జోరుతో సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మొదటి పోరుకు అందుబాటులో లేని కోహ్లీ, పంత్, జడేజా, బుమ్రా రాకతో భారత జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంటే.. సొంతగడ్డపై సత్తాచాటాలని ఇంగ్లిష్ టీమ్ తహతహలాడుతున్నది. మరి రోహిత్ సేన ఇక్కడే ట్రోఫీ చేజిక్కించుకుంటుందా.. లేక బట్లర్ గ్యాంగ్ బదులు తీర్చుకుంటుందా చూడాలి!
బర్మింగ్హామ్: పొట్టి ఫార్మాట్లో ప్రపంచ అత్యుత్తమ జట్ల మధ్య సమరంగా వర్ణించిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మొదటి పోరులో భారత్ 50 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరులో శనివారం జరుగనున్న పోరులోనూ నెగ్గాలని రోహిత్ సేన భావిస్తుంటే.. పరాజయానికి బదులు తీర్చుకొని సిరీస్ను సమం చేయాలని ఇంగ్లిష్ టీమ్ కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్లో హర్దిక్ పాండ్యా ఆల్రౌండ్ మెరుపులతో దుమ్మురేపడంతో టీమ్ఇండియా సునాయాసంగా గెలుపొందగా.. మొదట బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇంగ్లండ్.. ఆ తర్వాత బ్యాటింగ్లో తడబడింది. ఇటీవలి కాలంలో భారీ స్కోర్లను ఛేదిస్తూ.. దూకుడుకు మారుపేరుగా మారిన ఇంగ్లిష్ టీమ్ తిరిగి గాడిన పడాలని చూస్తున్నది. ఆఖరి టెస్టు కారణంగా విరాట్, పంత్, జడేజా, బుమ్రా అందుబాటులో లేకపోవడంతో గత మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. తొలి పోరులో సత్తాచాటిన దీపక్ హుడా, సూర్యుకుమార్ యాదవ్లో ఒకరు కోహ్లీ కోసం తమ స్థానాన్ని వదులుకోక తప్పదు. ఇక స్పిన్ ఆల్రౌండర్ కోటాలో అక్షర్ స్థానాన్ని జడేజా భర్తీ చేయడం ఖాయం కాగా.. వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్కు బదులు రిషబ్ పంత్వైపే మొగ్గు చూపొచ్చు. అర్శ్దీప్ తన స్థానాన్ని బుమ్రాకు త్యాగం చేయక తప్పదు. టీమ్ హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ స్థానాన్ని ద్రవిడ్ భర్తీ చేయనున్నాడు.
క్యా హువా.. కోహ్లీ
క్రికెట్కు బ్రేక్ ఇచ్చి సరదగా బీచ్లో గడిపితే తిరిగి ఫామ్ అందుకోవచ్చని ఒకరు.. బంతిని కాస్త ఆలస్యంగా ఆడితే మంచి షాట్లు కొట్టొచ్చని మరొకరు ఇలా.. క్రీడా విశ్లేషకులంతా తలో మాట అంటున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. కొన్నాళ్ల క్రితం వరకు రికార్డులు తిరగరాస్తూ.. పరుగుల యంత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ.. గత రెండెండ్లుగా అంతర్జాతీయ శతకం నమోదు చేయలేదు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్టులోనూ విరాట్ ఆకట్టుకోలేకపోయాడు. అదే సమయంలో పొట్టి ఫార్మాట్లో యువ ఆటగాళ్లు సత్తాచాటుతుండటం.. జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. అంతకుముందు ఈ ఫార్మాట్లో విరాట్ ఆడనున్న ఆఖరి సిరీస్ ఇదే అనే చర్చ జోరుగా సాగుతున్నది. విండీస్తో సిరీస్కు కోహ్లీ విశ్రాంతి కోరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కుర్రాళ్లతో పోటీలో నిలబడాలంటే విరాట్ బ్యాట్ నుంచి విలువైన ఇన్నింగ్స్ రావాల్సిందే!
కోహ్లీని ఎందుకు తప్పించొద్దు?: కపిల్ దేవ్
న్యూఢిల్లీ: ప్రదర్శన సరిగ్గా లేని కారణంగా అశ్విన్ను టెస్టు జట్టు నుంచి తొలగించినప్పుడు.. విరాట్ కోహ్లీని టీ20 ఫార్మాట్లో ఎందుకు పక్కన పెట్టకూడదని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ ప్రశ్నించాడు. విరాట్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతున్నాడని.. అతడిని తుది జట్టు నుంచి తప్పించే దిశగా మేనేజ్మెంట్ ఆలోచించాలని కపిల్ సూచించాడు. ‘ప్రపంచ రెండో ర్యాంకర్ బౌలర్ (అశ్విన్)ను టెస్టు తుది జట్టు నుంచి తప్పించగలిగినప్పుడు. కోహ్లీని పొట్టి ఫార్మాట్లో బెంచ్పై కూర్చోబెడితే తప్పేంటి. తన ఆటతీరుతో విరాట్ పేరు ప్రఖ్యాతలు సాధించాడు. కానీ ఇప్పుడా స్థాయి ప్రదర్శన అతడి నుంచి రావడం లేదు’ అని కపిల్ అన్నాడు.
వచ్చే నెల జింబాబ్వే టూర్
మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా వచ్చే నెల జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. 2016 తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటించలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లీ, సూర్యకుమార్/దీపక్ హుడా, పంత్, పాండ్యా, జడేజా, హర్షల్, భువనేశ్వర్, చాహల్, బుమ్రా.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, మలాన్, అలీ, లివింగ్స్టోన్, బ్రూక్, కరన్, జోర్డాన్, విల్లే, గ్లీసన్, పర్కిన్సన్.