మాంచెస్టర్: రెండు భారీ విజయాలతో టీ20 ప్రపంచకప్ వేటను ఆరంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్తో తలపడనుంది. నాలుగు రోజుల క్రితం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన టీమ్ఇండియా.. మళ్లీ గెలుపుబాట పట్టడంతో పాటు నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో ప్రత్యర్థిపై భారీ తేడాతో గెలువాలనే లక్ష్యంతో ఉంది. ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సేన.. నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా (8 పాయింట్లు) తర్వాత రెండో స్థానాన ఉన్నా సఫారీ, బంగ్లా జట్లు సైతం అన్నే పాయింట్లతో భారత్కు పోటీనిస్తున్నాయి. అయితే నెట్ రన్రేట్ విషయంలో భారత్ (+2.511).. సౌతాఫ్రికా (-0.546), బంగ్లా (-0.641) కంటే మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. బంగ్లాతో పాటు లీగ్ దశలో ఆఖరున ఆసీస్తో ఆడే మ్యాచ్లోనూ గెలిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. కానీ ఒక్కదాంట్లో ఫలితం తేడా కొట్టినా జట్టుకు కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో బంగ్లాపై భారీ తేడాతో గెలువడం హర్మన్ప్రీత్ అండ్ కో.కు అత్యంత కీలకం.