BAN vs IND : రెండో టెస్టులో భారత్ 314 పరుగలకు ఆలౌట్ అయింది. దాంతో, టీమిండియాకు మొదటి ఇన్నింగ్స్లో 87 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. శాంటో 5, జకిర్ హసన్ 2 రన్స్తో క్రీజులో ఉన్నారు. బంగ్లా ఇంకా 80 పరుగులు వెనకబడి ఉంది. రెండో రోజు రిషభ్ పంత్ (93), శ్రేయాస్ అయ్యర్ (85) అర్థ సెంచరీలతో రాణించడంతో మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించింది. వీళ్లిద్దరు ఆరో వికెట్కు 150 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. సెంచరీకి చేరువలో ఉన్న పంత్ చివరి సెషన్లో మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు విజృంభించడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. షకిబుల్ హసన్ శ్రేయాస్ అయ్యర్తో పాటు అక్షర్ పటేల్, అశ్విన్ పెవిలియన్ పంపి భారత్ను దెబ్బ తీశాడు. ఉనాద్కత్ (14 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (14) కాసేపు బంగ్లా బౌలర్లను ప్రతిఘటించారు.
బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, షకిబుల్ హసన్ తలా 4 వికెట్లు తీశారు. తస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. మూడో రోజు బంగ్లాదేశ్ను తొందరగా ఆలౌట్ చేయడంపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొదటి టెస్టులో నెగ్గిన టీమిండియా రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది.