నెల రోజులకు పైగా క్రీడాభిమానులను ఊర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్ చివరి అంకానికి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో విశ్వ విజేతను తేల్చే సమరానికి తెరలేవనుంది.
టోర్నీ ప్రారంభం నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా.. ఐదుసార్లు విశ్వ విజేత ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా అమీతుమీకి సిద్ధమైంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో బలంగా ఉన్న రోహిత్సేన.. కంగారూ సవాల్ను అధిగమించి ముచ్చటగా మూడోసారి విశ్వ విజేతగా నిలువాలని 140 కోట్ల మంది భారతీయులు ఆశిస్తుంటే.. సిక్సర్ కొట్టాలని ఆసీస్ చూస్తున్నది.
లక్షా ముప్పై వేల మంది అభిమానుల జయజయ ధ్వానాల మధ్య, అతిరథమహారథుల సమక్షంలో జరుగనున్న మెగా ఫైనల్లో రోహిత్, కోహ్లీ, షమీ జోరు కొనసాగించాలని చూస్తుంటే.. భారీ జనసందోహాన్ని నోరు మూపించడంలో వచ్చే కిక్కే వేరని ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మాటల యుద్ధానికి తెరలేపాడు.
రెండు దశాబ్దాల క్రితం 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో పరాజయం పాలైన భారత్.. ఈ సారి పట్టు వదల కూడదని చూస్తూంటే.. గత మ్యాచ్ల్లో కనబర్చిన పోరాట పటిమను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆసీస్ భావిస్తున్నది! బలాబలాల పరంగా సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య సమరంలో మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!
Cricket World Cup | అహ్మదాబాద్: పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్ఇండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన ఆదివారం అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో జరుగనున్న వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఆసీస్ ఐదుసార్లు ప్రపంచకప్ నెగ్గితే.. భారత్ రెండు సార్లు ట్రోఫీని ముద్దాడింది. మరి ఈ సారి టీమ్ఇండియా హ్యాట్రిక్ కొడుతుందా.. లేక ఆసీస్ సిక్సర్ దంచుతుందా చూడాలి. ఈ మెగాటోర్నీలో ఆడిన పది మ్యాచ్ల్లోనూ భారత్కు పరాజయం అన్నదే ఎదురుకాకపోగా.. టోర్నీ ఆరంభంలో రెండు మ్యాచ్లు ఓడిన తర్వాత ఆసీస్ పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి వరుసగా ఎనిమిది మ్యాచ్లు నెగ్గింది.
లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ విజయం సాధించగా.. దానికి బదులు తీర్చుకోవాలని కంగారూలు కాచుకు కూర్చున్నారు. భారత జట్టు విశ్వ విజేతగా నిలువాలని దేశ వ్యాప్తంగా యజ్ఞాలు, హోమాలు సాగుతున్నాయి. 1983 ప్రపంచకప్లో కపిల్దేవ్ సేన భారత్కు తొలి విశ్వ కప్పు అందించగా.. పన్నెండేండ్ల క్రితం 2011లో ధోనీ సారథ్యంలోని టీమ్ఇండియా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ అమృత ఘడియలకు ఒక్క విజయం దూరంలో ఉంది. గత రెండు వన్డే ప్రపంచకప్లలో సెమీఫైనల్లో వెనుదిరిగిన టీమ్ఇండియా ఈ సారి కప్పు కొట్టేందుకు సమాయత్తంగా ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాలను ఇస్తుండగా.. శుభ్మన్ గిల్ మంచి టచ్లో ఉన్నాడు. ఇక టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉండగా.. మిడిలార్డర్లో శ్రేయస్, రాహుల్ కీలకం కానున్నారు.
సూర్యకుమార్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా.. అతడికి అవకాశం రాకుండా టాపార్డరే పని ముగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. లేటుగా జట్టులోకి వచ్చిన షమీ ఫుల్ జోష్లో ఉంటే.. బుమ్రా, సిరాజ్ అతడికి సహకరిస్తున్నారు. పిచ్ స్పిన్కు సహకరిస్తే.. కుల్దీప్, జడేజా నుంచి ప్రత్యర్థులకు తిప్పలు తప్పకపోవచ్చు. మరోవైపు పోరాటానికి మారుపేరైన ఆస్ట్రేలియా కూడా బలంగా ఉంది. వార్నర్, హెడ్, మార్ష్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్వెల్ రూపంలో వారికి శత్రు దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. కెప్టెన్ కమిన్స్తో పాటు స్టార్క్, హజిల్వుడ్, జాంపాను ఎదుర్కోవడం శక్తికి మించిన పనే.
నెల రోజుల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్కు వాడిన పిచ్పైనే ఫైనల్ జరగనుంది. క్రీజులో నిలదొక్కుకుంటే భారీ స్కోరు సాధ్యమే. వాతావరణం చల్లగా ఉండనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు.
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్య, జడేజా, షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, హెడ్, మార్ష్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్వెల్, ఇంగ్లిస్, స్టార్క్, హజిల్వుడ్, జాంపా.
ఫైనల్ చేరారిలా..