గత టెస్టు సెంచరీ హీరో రోహిత్ శర్మ ఎక్కువసేపు నిలువలేకపోగా..
కొత్త పెళ్లికొడుకు కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ కొనసాగించాడు!
వందో టెస్టు ఆడుతున్న చతేశ్వర్ పుజారా ఖాతా తెరవకుండానే నిరాశగా వెనుదిరగగా..
లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ కాస్తలో కాస్త పోరాడాడు!!
స్పిన్ను సమర్థంగా ఎదుర్కుంటాడనుకున్న శ్రేయస్ అయ్యర్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరగా..
తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ అలా వచ్చి ఇలా వెళ్లాడు!!!
స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అదే బాటలో పయనించడంతో భారత జట్టు 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇంకేముంది మరో పదో పదిహేనో పరుగులకు టీమిండియా ఆలౌట్ కావడం ఖాయమే అని అనుకుంటున్న సమయంలో మేమున్నామంటు ‘అశ్విన్-అక్షర్’ ధ్వయం జట్టును ఆదుకుంది. పరిస్థితులు కఠినంగా మారి సవాలు విసురుతున్న సమయంలో క్రీజులో ఎలా నిలవాలో.. స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై పరుగులు ఎలా రాబట్టాలో ఈ జోడీ చేసి చూపించింది. ఫలితంగా రెండో టెస్టులో భారత్ కోలుకోగలగింది.
తొలి ఇన్నింగ్స్లో ఎదురుదాడే మంత్రంగా బరిలోకి దిగి మంచి స్కోరు చేసినా ఆస్ట్రేలియా బౌలింగ్లోనూ విజృంభించింది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్లు కంగారూల కోసం బిగించిన స్పిన్ పిచ్లో మనవాళ్లు చిక్కి విలవిలలాడారు. నాథన్ లియాన్ గింగిరాలు తిప్పే బంతులతో చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రాహుల్ (17) నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. రోహిత్ శర్మ (32), చతేశ్వర్ పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4) ఇలా ఒకరి తర్వాత ఒకరు లియాన్ బౌలింగ్లో పెవిలియన్కు వరుస కట్టారు. తొలి నాలుగు వికెట్లు అతడి ఖాతాలోకే వెళ్లాయి. దీంతో టీమిండియా 66/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (44) కాస్త పోరడగా.. అతడికి రవీంద్ర జడేజా (26) సహకారం అందించాడు. తొలి సెషన్ను మరో వికెట్ పడనివ్వకుండా పూర్తి చేసిన ఈ జోడీ.. రెండో సెషన్లో ప్రభావం చూపలేకపోయింది. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న కునెమన్ బౌలింగ్లో అంపైర్ ఇచ్చిన సందేహాస్పద నిర్ణయానికి కోహ్లీ వెనుదిరగగా.. జడేజా వికెట్ల ముందు దొరికిపోయాడు. శ్రీకర్ భరత్ (6) వారిని అనుసరించాడు. దీంతో రోహిత్ సేన 139/7తో నిలిచింది.
ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రవిచంద్రన్ అశ్విన్ (71 బంతుల్లో 37; 5 ఫోర్లు) అదరగొట్టారు. అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపారు. ఆరంభంలో క్రిజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన ఈ జోడీ.. ఒక సారి కుదురుకున్నాక యధేచ్ఛగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతలున్న టాపార్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమైన చోట.. ఢిల్లీ పిచ్పై ఎలా బ్యాటింగ్ చేయాలో వీరిద్దరు చూపెట్టారు. అతి జాగ్రత్తకు పోకుండా.. బౌలర్లపై ఎదురుదాడి చేయడమే ఉత్తమమని భావించి భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ గత్యంతరం లేక అటాకింగ్ ఫీల్డ్ తీసి.. డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా అక్షర్ టాపార్డర్ బ్యాటర్ను తలపిస్తూ చూడ చక్కటి షాట్లతో అలరించాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో లోయర్ ఆర్డర్ చూపిన తెగువ వల్లే భారత్ ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ చేజక్కించుకోగలిగిందనే విషయం తెలిసిందే. అలాంటి పట్టుదలే కొనసాగించిన అశ్విన్-అక్షర్ ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించి భళా అనిపించారు. మరికాసేపైతే టీమ్ఇండియాకు ఆధిక్యం దక్కడం ఖాయమే అనుకుంటున్న దశలో కొత్త బంతి తీసుకున్న ఆసీస్.. పేసర్లను రంగంలోకి దింపి భారత ఇన్నింగ్స్కు తెరదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అక్షర్ వేసిన బాటలో నడిచినట్లు స్పష్టంగా కనిపించింది. ఆత్మరక్షణకు పోతే వికెట్లు కోల్పోవడం ఖాయమని గట్టిగా విశ్వసించిన కంగారూలు.. తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగి వీలైనన్ని పరుగులు రాబట్టారు.
* ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై వంద టెస్టు వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. కుంబ్లే (111) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసీస్తో అశ్విన్కు ఇది 20వ టెస్టు.
* కష్టకాలంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్క్లాస్లో 5 వేల పరుగులతో పాటు 700 వికెట్లు పడగొట్టిన ఐదో భారత బౌలర్గా నిలిచాడు. వినూ మన్కడ్, ఎస్. వెంకటరాఘవన్, కపిల్దేవ్, అనిల్ కుంబ్లే ముందున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్ (ఖవాజా 81, హ్యాండ్స్కోంబ్ 72 నాటౌట్; షమీ 4/60, అశ్విన్ 3/57), భారత్ తొలి ఇన్నింగ్స్: 262 ఆలౌట్ (అక్షర్ 74, కోహ్లీ 44; లియాన్ 5/67, మార్ఫే 2/53), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 61/1 (హెడ్ 39 నాటౌట్, లబుషేన్ 16 నాటౌట్; జడేజా 1/23).