IND vs AUS | వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం ఆడిన తొలి టీ20లో విజయం సాధించిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. వైజాగ్లో రికార్డు స్కోరు చేజ్ చేసిన యువభారత జట్టు.. నేడు ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది. బ్యాటింగ్లో జట్టుకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. బౌలింగ్లో మరింత రాణించాలని భారత్ భావిస్తుంటే.. సిరీస్ సమం చేయాలని కంగారూలు కాచుకు కూర్చున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కేరళపై అధికంగా ఉండటంతో.. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది!
తిరువనంతపురం: సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో నిండిన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో రెండో టీ20కి రెడీ అయింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించిన సూర్యకుమార్ సేన.. ఆదివారం తిరువనంతపురంలో ఆసీస్తో మరోసారి తలపడనుంది. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో భంగపడ్డ టీమ్ఇండియా.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్కప్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది.
పొట్టి ప్రపంచకప్లో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలనుకుంటున్న మేనేజ్మెంట్.. ఈ సిరీస్లో వాళ్లకు విరివిగా అవకాశాలు ఇస్తున్నది. మెగాటోర్నీకి ముందు భారత జట్టు ఈ ఫార్మాట్లో మరో 10 మ్యాచ్లు మాత్రమే ఆడనుండటంతో.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఆటగాడు ఆశిస్తున్నాడు. అయితే మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపెడుతున్నది. టీమ్ఇండియా గత మ్యాచ్లో ఆడిన 11 మందితోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషన్ వన్డౌన్లో బ్యాటింగ్కు రానున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూసింగ్తో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఉత్కంఠ రేపిన వైజాగ్ మ్యాచ్లో రింకూ సింగ్ చివరి వరకు నిలిచి తనలో మంచి ఫినిషర్ ఉన్నాడని నిరూపించుకోగా.. అక్షర్ పటేల్ అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది.
బౌలింగ్ విషయానికి వస్తే.. ముఖేశ్ కుమార్ డెత్ ఓవర్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చగా.. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో లోపాలు సరిచూసుకునే బరిలోకి దిగాలని మేనేజ్మెంట్ కోరుకుంటున్నది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా భారీ బలగంతో శత్రుదుర్బేధ్యంగా కనిపిస్తున్నది. సెంచరీ హీరో ఇంగ్లిస్తో పాటు స్మిత్, షార్ట్, స్టొయినిస్, డేవిడ్, వేడ్ను ఈ మ్యాచ్లో ఆపడం కష్టమే.
పిచ్, వాతావరణం
ఈ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేయడం కష్టం. ఇక్కడ జరిగిన మూడు టీ20 మ్యాచ్ల్లో చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది. ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, రుతురాజ్, ఇషాన్, తిలక్, రింకూ, అక్షర్, రవి, అర్ష్దీప్, ప్రసిద్ధ్, ముఖేశ్.ఆస్ట్రేలియా: వేడ్ (కెప్టెన్), స్మిత్, షార్ట్, ఇంగ్లిస్, స్టొయినిస్, డేవిడ్, హార్డీ, అబాట్, ఎలీస్, బెరన్డార్ఫ్, తన్వీర్.