కోల్కతా: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పర్యటనను.. 26కు మార్చడంతో పాటు.. టెస్టు, వన్డే సిరీస్లు మాత్రమే ఆడాలని బీసీసీఐ నిర్ణయించింది. శనివారం జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)లో ఈ పర్యటనతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా ఈ నెల 17న దక్షిణాఫ్రికా ప్రయాణం కానుండగా.. ఆ తర్వాత వన్డే సిరీస్ మాత్రమే ఆడి వెనుదిరగనుంది. ముందస్తు షెడ్యూల్లో ఉన్న నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ను.. ఆ తర్వాత ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ‘దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా టెస్టు, వన్డే సిరీస్లు ఆడుతుంది. మిగతా 4 టీ20 మ్యాచ్లు తర్వాత ఆడుతాం. తొలి టెస్ట్ మ్యాచ్ ఈనెల 26న ప్రారంభం కానుంది’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) స్వాగతించింది. 48 గంటల్లో మ్యాచ్ల తేదీలు, వేదికలను దక్షిణాఫ్రికా ఖరారు చేయనుంది.
ఏజీఎమ్లో తీసుకున్న కీలక నిర్ణయాలు
అంపైర్లు, సహాయ సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు. 60 ఏండ్ల నుంచి 65కు పెంచడంతో లబ్ధి పొందనున్న స్కోరర్లు, అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు.
ఈశాన్య భారతదేశంతోపాటు పాండిచ్చేరి, బీహార్, ఉత్తరాఖండ్లో క్రికెట్ అభివృద్ధికి కృషి. మౌలిక సౌకర్యాల కల్పనకు రాష్ర్టానికి రూ.10 కోట్లు.
ఐపీఎల్ కార్యనిర్వాహక మండలిలో బ్రిజేశ్ పటేల్, మజుందార్కు చోటు.
ఐపీఎల్ మండలిలో భారత క్రికెటర్ల సంఘం ప్రతినిధిగా ప్రజ్ఞాన్ ఓజా.
దివ్యాంగుల క్రికెట్ విషయంలో కమిటీలు వేయాలని నిర్ణయం.