ముంబై: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test rankings)లో టీమిండియా జట్టు టాప్ ప్లేస్ కొట్టేసింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసి .. రోహిత్ శర్మ జట్టు వార్షిక ర్యాంకింగ్స్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఐసీసీ ఇవాళ ఆ ర్యాంకింగ్స్ను రిలీజ్ చేసింది. దాదాపు 15 నెలల పాటు టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది.
🚨 New World No.1 🚨
India dethrone Australia in the annual update of the @MRFWorldwide ICC Men's Test Rankings ahead of the #WTC23 Final 👀
— ICC (@ICC) May 2, 2023
జూన్లో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్కు ముందే ఐసీసీ తన ర్యాంకింగ్స్ జాబితాను సవరించింది. అయితే వచ్చే నెల ఏడో తేదీన ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడనున్న విషయం తెలిసిందే.
ర్యాంకింగ్స్ రిలీజ్ కావడానికి ముందు ఆస్ట్రేలియా 122 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఇండియా 119 పాంయిట్లతో రెండో స్థానంలో ఉండేది. అయితే మే 2020 నుంచి మే 2022 లోపు ముగిసిన అన్ని సిరీస్లను పరిగణలోకి తీసుకుని తాజా ర్యాంకింగ్స్ను రూపొందించారు.
దీంతో ఇటీవల పాక్, కివీస్లపై ఆసీస్ నెగ్గినా.. ఆ జట్టుకు పాయింట్లు కలిసిరాలేదు. దాని వల్ల ఆస్ట్రేలియా రేటింగ్ 121 నుంచి 116 పాయింట్లకు పడిపోయింది. ఇక ఇండియా విషయంలో 2019లో కివీస్తో జరిగిన సిరీస్ ఓటమిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో భారత్కు రెండు పాయింట్లు జత కలిశాయి. దీని వల్ల 119 పాయింట్ల నుంచి 121 పాయింట్లకు ఇండియా చేరుకున్నది.