టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అభిమానులకు శుభవార్త. ఇకనుంచి ఇరు దేశాల మధ్య జరుగబోయే టెస్టుల సంఖ్య పెరగనుంది. ఇన్నాళ్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నిర్వహిస్తున్న టెస్టు సిరీస్ ను ఇలా పిలుస్తారు) నిమిత్తం నాలుగు టెస్టులు ఆడేందుకు గాను భారత జట్టు.. ఏడాదిలో ఒకసారి ఆసీస్ కు వెళ్లేది. కానీ ఇకనుంచి టీమిండియా.. ఏడాదిలో రెండుసార్లు ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంటుంది.
ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) తదుపరి షెడ్యూల్ (2024-32) లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టులు కాకుండా వాటిని ఐదుకు పెంచి.. ఏడాదిలో రెండు పర్యాయాలు పర్యటన ఉండేలా కొత్త షెడ్యూల్ కు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపినట్టు సమాచారం.
ఇండియా-ఆస్ట్రేలియా, ఇండియా-ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ సిరీస్ లకు సీజన్లతో సంబంధం లేకుండా బోర్డులు, ప్రసారదారుల (బ్రాడ్కాస్టర్స్) కు మంచి ఆదాయం వస్తుండటంతో ఐసీసీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ మూడు దేశాల మధ్య జరిగే టెస్టులను చూడటానికి కూడా పెద్ద ఎత్తున జనాలు స్టేడియాలకు వస్తున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గత పర్యటనలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారీగా ఆదాయం వచ్చింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్-ఆసీస్ మధ్య ముగిసిన యాషెస్ సిరీస్ ను చూడటానికి కూడా ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తారు.
ప్రస్తుత FTP (2018-2023) వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ లో భారత్ వేదికగా జరుగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. అయితే కొత్త ప్రతిపాదనలపై ఈ నెల 25, 26న బర్మింగ్హోమ్ లో జరుగబోయే సమావేశంలో స్పష్టత రానున్నది. బర్మింగ్హోమ్ లో జరుగబోయే కామన్వెల్త్ క్రీడలలో తొలసారిగా క్రికెట్ (మహిళల) ను చేర్చారు. ఈ సందర్బంగా ఐసీసీ అక్కడ సమావేశమవనున్నది.