ఊహించిందే జరిగింది! తొలి రోజు ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డ చోట మనవాళ్లు దుమ్మురేపారు. ఉప్పల్ పిచ్పై బంతిని ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ ప్లేయర్లు ఆపసోపాలు పడితే.. రోహిత్ గ్యాంగ్ ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని బాదుడు కొనసాగించింది!
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శతక్కొట్టే అవకాశం చేజార్చుకోగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మూడంకెల స్కోరుకు సమీపించాడు. ఇప్పటికే 175 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న టీమ్ఇండియా.. శనివారం ఉదయం మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి! ఇదే జోరు సాగితే.. ఇక రెండోసారి రోహిత్ సేన బ్యాటింగ్ చేయాల్సి రాకపోవచ్చు!
Ind Vs Eng Test | హైదరాబాద్, ఆట ప్రతినిధి: బంతితో ఇంగ్లండ్ కట్టిపడేసిన టీమ్ఇండియా.. బ్యాట్తో దుమ్మురేపింది. ప్రత్యర్థి ప్లేయర్లు క్రీజులో నిలబడేందుకే ఇబ్బంది పడ్డ ఉప్పల్ పిచ్పై భారత ఆటగాళ్లు యధేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఇంగ్లండ్తో తొలి టెస్టుపై రెండో రోజే రోహిత్ సేన పట్టు బిగించింది. ఓవర్నైట్ స్కోరు 119/1తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా.. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (86; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్సెంచరీలతో చెలరేగారు. శ్రేయస్ అయ్యర్ (35), శుభ్మన్ గిల్ (23) మంచి ఆరంభాలు లభించాక.. భారీ షాట్లకు యత్నించి ఔట్ కాగా.. తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ (41) సత్తాచాటాడు. అశ్విన్ దురదృష్టవశాత్తు రనౌట్ కాగా.. చివర్లో అక్షర్ పటేల్ (35 బ్యాటింగ్, 5 ఫోర్లు, 1 సిక్సర్) తన విలువ చాటుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్, హార్ట్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చేతిలో మరో మూడు వికెట్లు ఉన్న టీమ్ఇండియా.. ప్రస్తుతం 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. జడ్డూ, అక్షర్ జోడీ.. మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందనేదానిపై భారత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తారు. శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా అటు స్కూల్ పిల్లలకు తోడు ఆర్మీ జవాన్ల కుటుంబాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఉచిత ప్రవేశం కల్పించింది. దీంతో ఈ మధ్య కాలంలో ఎన్నడూలేని విధంగా టెస్టు మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. రెండో రోజు ఆటకు 30,886 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు స్టేడియం మొత్తం కలియతిరిగారు. అంతకుముందు ఉదయం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండాను జగన్ ఎగరవేశారు.
రవిచంద్రన్ అశ్విన్కు కోపమొచ్చింది. కేఎస్ భరత్ ఔట్ తర్వాత క్రీజులోకొచ్చిన అశ్విన్ అనుకోకుండా రనౌట్ అయ్యాడు. కవర్స్లో షాట్ ఆడిన అశ్విన్.. పరుగు కోసం ప్రయత్నించగా, జడేజా సరిగ్గా స్పందించకపోవడంతో ఒక పరుగుకే రనౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. జడేజా పరుగు తీసినట్టే తీసి తిరిగి క్రీజులోకి రావడం అశ్విన్ ఔట్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో సింగిల్ డిజిట్కే ఔటైన అశ్విన్.. జడేజాపై కోపాన్ని ప్రదర్శించాడు.
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్టయిలే వేరు. ఇంగ్లండ్తో హైదరాబాద్లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న జడేజా.. తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. అర్ధసెంచరీ మార్క్ అందుకోగానే బ్యాట్ను తల్వార్లా తిప్పుతూ తన రాజసాన్ని ప్రదర్శించాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246;
భారత్ తొలి ఇన్నింగ్స్: 421/7 (రాహుల్ 86, జడేజా 81 నాటౌట్; రూట్ 2/77, హార్ట్లీ 2/131).