న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి ఫుల్ జోష్లో ఉన్న భారత హాకీ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ సంబంధిత కారణాల వల్ల వచ్చే నెలలో భారత్ వేదికగా జరుగనున్న హాకీ జూనియర్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ ప్రకటించిన మరుసటి రోజే హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఇంగ్లండ్లో కఠిన క్వారంటైన్ నిబంధనలు కొనసాగుతుండటంతో పాటు.. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఐ తెలిపింది. ఈ మేరకు మంగళవారం భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు లేఖ రాసినట్లు హెచ్ఐ అధ్యక్షుడు జ్ఞానేంద్ర వెల్లడించాడు. వచ్చే ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హామ్లో కామన్వెల్త్ క్రీడలు జరుగనుండగా.. సెప్టెంబర్10 నుంచి 25 వరకు హాంగ్జూలో ఆసియా క్రీడలు నిర్వహించనున్నారు. పారిస్ ఒలింపిక్స్ (2024)కు అర్హత ఈవెంట్ కావడంతో ఆసియా క్రీడలకు ముందు భారత పురుషుల, మహిళల జట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జ్ఞానేంద్ర తెలిపారు.