IND vs SL | ముంబై: మెగాటోర్నీలో భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. సొంతగడ్డపై ఎలాగైనా కప్ ఒడిసిపట్టుకోవాలన్న కసితో ఉన్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నది. ఆస్ట్రేలియాతో మొదలైన రోహిత్సేన విజయపరంపర ఆ తర్వాత అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్..ఇలా అందరి భరతం పడుతున్నది. మరోవైపు లంకేయుల కథ ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. కీలక ప్లేయర్లు గాయాలతో టోర్నీకి దూరమైతే..ఉన్నవాళ్లు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా అనూహ్య ఓటములు చవిచూస్తున్నది. గత మ్యాచ్లో పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమి ఇందుకు నిదర్శనం. పరుగుల వరదకు చిరునామా అయిన వాంఖడే స్టేడియంలో భారత్కు కనీసం పోటీనివ్వాలన్న పట్టుదలతో లంకేయులు బరిలోకి దిగే అవకాశముంది.
మార్పుల్లేకుండానే: లంకతో మ్యాచ్లో భారత్ ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయోగాల జోలికి పోకుండా విన్నింగ్ కాంబినేషన్ కొనసాగించేందుకు మేనేజ్మెంట్ మొగ్గుచూపవచ్చు. గాయపడ్డ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోకపోవడంతో మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ను కొనసాగించనున్నారు. రోహిత్శర్మ, విరాట్కోహ్లీ సూపర్ఫామ్ మీద ఉండటం టీమ్ఇండియాకు కలిసిరానుంది. వీరిద్దరు బ్యాట్లు ఝుళిపిస్తే ముంబైలో పరుగుల వరద ఖాయం కానుంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ నిలకడలేమి ఇబ్బందిగా మారినా.. ఒక్కసారి టచ్లోకి వస్తే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. మిడిలార్డర్లో భారీ అంచనాలు పెట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో 33.50 సగటుతో134 పరుగులకే పరిమితమయ్యాడు. బౌలింగ్ విషయానికొస్తే.. షమీ, బుమ్రా సూపర్ ఫామ్మీదున్నారు. వీరిద్దరు ఇదే జోరు కొనసాగిస్తే..లంక బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు ఖాయం. వీరికి కుల్దీప్యాదవ్, జడేజా జతకలిస్తే భారత్కు ఎదురుండకపోవచ్చు.
భారత్: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్
శ్రీలంక: కుశాల్ మెండిస్(కెప్టెన్), నిస్సనక, కరుణరత్నె, సమరవిక్రమ, చరిత అసలంక, మాథ్యూస్, వెల్లాలగె/డిసిల్వా, రజిత, తీక్షణ, మదుశనక, చమీర.