మన అమ్మాయిలు అదరగొట్టారు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో అద్వితీయ ప్రదర్శనతో చాంపియన్స్గా నిలిచారు. టోర్నీ ఆసాంతం రాణించిన యంగ్ ఇండియా.. ఫైనల్లో ఇంగ్లండ్పై జయకేతనం ఎగరవేసింది. అమ్మాయిల ఘనతను సామాన్యుడి నుంచి దేశ ప్రథమ పౌరుడి వరకు వేనోళ్ల కొనియాడగా.. బీసీసీఐ అక్షరాల ఐదు కోట్ల నజరానా ప్రకటించింది.
పోచెఫ్స్ట్రూమ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. తొలిసారి నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్నారు. ఫేవరెట్గా బరిలోకి దిగిన యంగ్ ఇండియా ఆదివారం జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘనవిజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. రియానా మెక్డొనాల్డ్ (19) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో టిటాస్ సధు, అర్చనా దేవి, పార్షవి చోప్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యంగ్ ఇండియా 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష (24), సౌమ్య తివారి (24), కెప్టెన్ షఫాలీ వర్మ (15) రాణించారు. టిటాస్ సధుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఇంగ్లండ్ ఆల్రౌండర్ గ్రేస్ స్క్రీవెన్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. మహిళల విభాగంలో ఇప్పటి వరకు భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలువలేకపోగా.. ఇప్పుడు బాలికలు ఆ లోటు తీర్చారు.
సూపర్ త్రిష..
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలువడంలో తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ చాంపియన్గా అవతరించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ చారిత్రక విజయంలో తెలంగాణ ప్రతిభ కూడా ఉండటం గర్వకారణమని ఒక ప్రకటనలో తెలిపారు. త్రిష భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆదివారం జరిగిన ఫైనల్లో త్రిష భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.