IND vs WI | తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా జూలు విదిల్చింది. మొదట బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేయడంతో విండీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కాగా.. బ్యాటింగ్లో ఈ సారి మనవాళ్లు దుమ్మురేపారు. గత రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో రాణించగా.. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ మరోమారు తన విలువ చాటుకున్నాడు.
గయానా: పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ కీలక సమయంలో సత్తాచాటింది. సిరీస్ చేజారే ప్రమాదం పొంచి ఉన్న పోరులో హార్దిక్ సేన సమిష్టిగా రాణించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తుచేసింది. ఫలితంగా సిరీస్లో భారత్ 1-2తో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (42; 5 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ రావ్మన్ పావెల్ (19 బంతుల్లో 40 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఆకట్టుకోగా.. మయేర్స్ (25), పూరన్ (20) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసిం ది. ‘360 డిగ్రీస్ ప్లేయర్’ సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 83; 10 ఫోర్లు, 4 సిక్స ర్లు) దంచికొట్టగా.. హైదరాబాదీ ప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
పొట్టి ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఓపెనర్ ఇషాన్ కిషన్ను తప్పించి ఈ మ్యాచ్లో కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్కు టీ20 అరంగేట్ర అవకాశం కల్పించారు. అయితే వచ్చీ రాగానే భారీ షాట్కు యత్నించిన యశస్వి (1) ఒక్క పరుగే చేసి వెనుదిరగగా.. మరో ఓపెనర్ గిల్ (6) మూడో మ్యాచ్లోనూ పేలవ ఫామ్ కొనసాగించాడు. దీంతో 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో మరోసారి అనుమానాలు రేకెత్తినా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జంట వాటిని పటాపంచలు చేసింది. గత రెండు మ్యాచ్ల్లోనూ విలువైన ఇన్నింగ్స్లు ఆడిన తిలక్ వర్మ అదే జోరు కొనసాగించగా.. సూర్యకుమార్ దంచికొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. వికెట్కు నలువైపులా షాట్లు ఆడిన సూర్యకుమార్.. ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మనవాళ్లు డకవర్త్ లూయిస్ పద్ధతిని మనసులో పెట్టుకొని బ్యాటింగ్ చేసినట్లు కనిపించింది. ఓ ఎండ్లో సూర్య దంచికొడుతుంటే.. తిలక్ అతడికి పూర్తి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 51 బంతుల్లోనే 87 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేశారు. సూర్య ఔటైన తర్వాత తిలక్ కెప్టెన్ హార్దిక్ కలిసి జట్టును గెలిపించారు.
వెస్టిండీస్: 159/5 (కింగ్ 42, పావెల్ 40 నాటౌట్; కుల్దీప్ 3/28),
భారత్: 17.5 ఓవర్లలో 164/3 (సూర్యకుమార్ 83, తిలక్ వర్మ 49 నాటౌట్; అల్జారీ జోసెఫ్ 2/25).