న్యూఢిల్లీ: భారత్ మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ తాజాగా 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీకి వేదిక కాబోతున్నది. గురువారం టూరన్(పోలండ్) వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు అదిల్లె సుమరివాల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్న భువనేశ్వర్లో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టేడియం కాంప్లెక్స్ను ఇద్దరు సభ్యులతో కూడిన వరల్డ్ అథ్లెటిక్స్ బృందం పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రెండేండ్ల తర్వాత జరిగే టోర్నీలో మొత్తం 26 ఈవెంట్లలో అథ్లెట్లు పోటీపడనున్నారు. పురుషులకు 13, మహిళలకు 13 విభాగాల చొప్పున కేటాయించారు. ఇందులో 60మీ, 400మీ, 800మీ, 1500మీ, 3000మీ, 60మీ హార్డిల్స్, 4X 400 రిలే, హైజంప్, పోల్వాల్ట్, లాంగ్జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, హెప్టాథ్లాన్కు చోటు కల్పించారు. దేశంలో అథ్లెటిక్స్కు పెరుగుతున్న ఆదరణకు ఇది ఉదాహరణ అని జాతీయ అథ్లెటిక్స్ అసోసియేషన్(ఏఎఫ్ఐ) అధ్యక్షుడు బాహుదూర్సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే 2028 ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి కూడా భారత్ వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.