ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు నేడు తెరలేవనుంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న రోహిత్సేన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఎలాగైనా ఆసీస్పై గెలిచి డబ్ల్యూటీసీ తుదిపోరులో నిలువాలన్న పట్టుదలతో టీమ్ఇండియా కనిపిస్తున్నది. మొతెరాలో కంగారూలను కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. ఇండోర్ టెస్టు విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో అహ్మదాబాద్లో సత్తాచాటాలని ఆసీస్ చూస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య రసవత్తర పోరుకు అవకాశముంది.
అహ్మదాబాద్: ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు వేళయైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి మొదలవుతున్నది. సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలని చూస్తున్నది. మూడో టెస్టు విజయం ద్వారా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న కంగారూలు అదే ఊపు కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
స్పిన్నర్ల ఆధిపత్యం స్పష్టంగా కొనసాగుతున్న వేళ గత మూడు టెస్టులు మూడు రోజుల్లోపే ముగిసిన నేపథ్యంలో అహ్మదాబాద్ టెస్టుపై మరింత ఆసక్తి నెలకొన్నది. తొలి రోజు నుంచే స్పిన్కు అనుకూలించే అవకాశమున్న నేపథ్యంలో మరోమారు వికెట్ల వేట దిగ్విజయంగా కొనసాగనుంది. ఆఖరి టెస్టు కోసం రెండు పిచ్లను సిద్ధం చేయగా కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పిన్కు అనుకూలించే పిచ్కే మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పిచ్ను పరిశీలించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశముందని వ్యాఖ్యానించాడు. మొత్తంగా బ్యాటర్లు, స్పిన్నర్ల మధ్య ఆసక్తికర పోరుకు అవకాశముంది.
ఆసీస్తో నాలుగో టెస్టు కోసం భారత్ తుది జట్టులో మార్పులు చేసే చాన్స్ కనిపిస్తున్నది. గత మూడు మ్యాచ్ల్లో బ్యాటింగ్లో నిరాశపరిచిన వికెట్కీపర్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో దూకుడుగా ఆడే కిషన్..టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.
నాలుగో టెస్టు కోసం స్మిత్ సారథ్యంలో పోటీకి దిగుతున్న ఆసీస్..స్పిన్నర్ టాడ్ మర్ఫీ స్థానంలో పేసర్లలో స్కాట్ బొలాండ్, లాన్స్ మోరిస్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇప్పటికే డబ్ల్యూటీసీ బెర్తు దక్కించుకున్న ఆసీస్ భారీ మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజార, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, ఉమేశ్యాదవ్/సిరాజ్
ఆస్ట్రేలియా: స్మిత్(కెప్టెన్), హెడ్, ఖవాజ, లబుషేన్, హ్యాండ్స్కోంబ్, గ్రీన్, అలెక్స్ క్యారీ, స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, కునెమన్.