IND vs IRE | డబ్లిన్: భారత్, ఐర్లాండ్ మధ్య ఆఖరి పోరు వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షంతో మూడో మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. ఉదయం నుంచి వాన దంచికొట్టడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. మ్యాచ్ మొదలయ్యే సమయానికి వరుణుడు రంగప్రవేశం చేశాడు. పోరు ఆలస్యంగానైనా మొదలవుతుందనుకున్న అభిమానుల ఆశలపై వర్షం నీళ్లు గుమ్మరించింది. వాన ఆటంకంతో టాస్కు వీలులేకుండా పోయింది.
పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటకు అనుకూలంగా లేదని ప్రకటించడంతో మ్యాచ్ అధికారికంగా రద్దయ్యింది. దీంతో 2-0 ఆధిక్యంతో టీమ్ఇండియా టీ20 సిరీస్ను దక్కించుకుంది. తొలి మ్యాచ్లోనూ వరుణుడు ప్రవేశం చేసినా..డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించిన బుమ్రా సేన మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను ఖాతాలో వేసుకుంది. నాలుగు వికెట్లు తీసిన టీమ్ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది. ఈ నెల 30 నుంచి ఆసియాకప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్ ద్వితీయ శ్రేణి బలగంతో బరిలోకి దిగుతున్నది. యువ భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు.
చంద్రమామపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా అడుగుపెట్టిన సందర్భాన్ని టీమ్ఇండియా క్రికెటర్లు ఆస్వాదించారు. యావత్తు ప్రపంచం గర్వపడేలా జాబిలి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ నిలిచిన వేళ..క్రికెటర్లు సంబురాల్లో మునిగిపోయారు. అందరూ టీవీ ముందు చేరి ల్యాండింగ్ అయిన వెంటనే చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు.