రాంచీ: భారత మహిళల హాకీ జట్టుకు భంగపాటు. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని అమ్మాయిలు చేజేతులా వదులుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఎఫ్ఐహెచ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ సత్తాచాటడంలో విఫలమైంది. శుక్రవారం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో టీమ్ఇండియా 0-1తేడాతో జపాన్ చేతిలో ఓటమిపాలైంది. కనా ఉరాట(6ని) జపాన్కు ఏకైక గోల్ అందించింది. దీంతో విశ్వక్రీడలకు బెర్తు దక్కించుకునే మంచి అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. గెలిస్తే తప్ప పారిస్కు అర్హత సాధించే అవకాశం లేని పరిస్థితుల్లో అమ్మాయిలు తుదికంటా పోరాడినా లాభం లేకపోయింది.
గురువారం జరిగిన సెమీస్లో జర్మనీ చేతిలో ఓడిన భారత్కు తాజాగా జపాన్ చెక్ పెట్టింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన జపాన్..భారత్ ఒలింపిక్స్ అవకాశాలపై నీళ్లు గుమ్మరించింది. మ్యాచ్లో తొలి రెండు క్వార్టర్లు జపాన్ ఆధిపత్యం ప్రదర్శిస్తే..మిగిలిన రెండు క్వార్టర్లో టీమ్ఇండియా గోల్ చాన్స్లను సద్వినియోగం చేసుకోలేకపోయింది. మ్యాచ్ మొత్తమ్మీద తొమ్మిది పెనాల్టీ కార్నర్లు లభించినా భారత్ గోల్స్గా మలువలేక మూల్యం చెల్లించుకుంది. ఎఫ్ఐహెచ్ టోర్నీలో అమ్మాయిల ప్రదర్శనపై పలువురు హాకీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోక్యో(2020) ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్..ఈసారి కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది.