టెస్టు సిరీస్ పరాజయానికి వన్డేల్లోనైనా బదులు తీర్చుకుంటుందనుకున్న టీమ్ఇండియా మూడు మ్యాచ్ల సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. క్రీజులో కాసేపు కుదురుకుంటే బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టం కాని పిచ్పై రాహుల్ సేన ప్రభావం చూపలేకపోయింది. ప్రత్యర్థి జట్టులో ఒకరికి ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలతో కదంతొక్కిన చోట.. మనవాళ్లు
పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. బవుమా, డసెన్ శతకాలతో మంచి స్కోరు చేసిన దక్షిణాఫ్రికా.. పకడ్బందీ బౌలింగ్తో టీమ్ఇండియాను కట్టడి చేసింది. శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ అర్ధ శతకాలతో రాణించినా.. వాటిని మూడంకెల స్కోర్లుగా మలచలేకపోగా.. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై భారత్కు భంగపాటు తప్పలేదు!
పార్ల్: సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటలేకపోయిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్ తొలి మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. నిలదొక్కుకుంటే పరుగులు రాబట్టడం సులువైన పిచ్పై మెరుగైన ఆరంభం లభించిన అనంతరం రాహుల్ సేన చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0తో ముందంజ వేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్ డెర్ డసెన్ (96 బంతుల్లో 129 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ టెంబా బవుమా (110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. క్వింటన్ డికాక్ (27), జానెమన్ మలన్ (6), మార్క్మ్ (4) పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. వీరిద్దరూ సఫారీ ఇన్నింగ్స్కు ఇరుసులా నిలబడ్డారు. 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో ఈ జంట నాలుగో వికెట్కు 204 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ పగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధశతకాలు చేసినా ఫలితం లేకపోయింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (12)తో పాటు రిషబ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ (17), వెంకటేశ్ అయ్యర్ (2), అశ్విన్ (7) ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఆఖర్లో శార్దూల్ (43 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగ్డీ, షంసీ, ఫెలుక్వాయో తలా రెండు వికెట్లు పడగొట్టారు. డసెన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగనుంది.
భారత్ తరఫున విదేశాల్లో అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్గా సచిన్ టెండూల్కర్ను దాటేసి విరాట్ కోహ్లీ (5065) అగ్రస్థానానికి చేరాడు.
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 296/4 (డసెన్ 129 నాటౌట్, బవుమా 110; బుమ్రా 2/48), భారత్: 50 ఓవర్లలో 265/8 (ధవన్ 79, కోహ్లీ 51; షంసీ 2/52, ఫెలుక్వాయో 2/26).