IND vs WI | టెస్టు సిరీస్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన.. వెస్టిండీస్ వన్డే సిరీస్లోనూ అదే పేలవ ఆటతీరు కనబర్చింది. భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన విండీస్.. బౌలింగ్లోనూ మెరిపించలేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలకు ప్రయత్నించిన రోహిత్ సేన 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
బ్రిడ్జ్టౌన్: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు.. భారత్తో తొలి వన్డేలో ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో కరీబియన్లను చిత్తుచేసింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ ప్లేయర్లు గల్లీ క్రికెటర్ల తరహాలో పెవిలియన్కు క్యూ కట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు.. 23 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (43) టాప్ స్కోరు కాగా.. మయేర్స్ (2), హెట్మైర్ (11), పావెల్ (4), కింగ్ (17) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4, జడేజా 3 వికెట్లు పడగొట్టారు.
అనతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో మెరిశాడు. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది.
టార్గెట్ పెద్దది కాకపోవడంతో ఛేదనలో భారత్ ప్రయోగాలకు తెరతీసింది. రోహిత్కు బదులు గిల్ (7)తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేశాడు. అయితే ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. ఒక ఎండ్లో ఇషాన్ ధాటిగా ఆడినా.. మరోవైపు నుంచి వరుసగా వికెట్లు పడుతూ పోయాయి. సూర్యకుమార్ యాదవ్ (19), హార్దిక్ పాండ్యా (5), శార్దూల్ ఠాకూర్ (1) విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (16 నాటౌట్)తో కలిసి రోహిత్ శర్మ (12 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు.
వెస్టిండీస్: 114 (హోప్ 43; కుల్దీప్ 4/6, జడేజా 3/37),
భారత్: 118/5 (ఇషాన్ 52; మోటియా 2/26).
న్యూఢిల్లీ : భారత ప్రధాన పేసర్గా సేవలందిస్తున్న హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్కు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని సిరాజ్ను విండీస్తో వన్డే సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చింది. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ గైర్హాజరీలో టెస్టు సిరీస్లో భారత బౌలింగ్ దళానికి నేతృత్వం వహించిన సిరాజ్ను తాజాగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో స్వదేశానికి తిరుగు పయనమైన సిరాజ్.. ఇక నేరుగా ఆసియాకప్లోనే బరిలోకి దిగనున్నాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్ కోసం యువ ఆటగాళ్లనే ఎంపిక చేయాలని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. దీంతో సిరాజ్ బెంగళూరులోని ఆసియాకప్ క్యాంప్లో సన్నద్ధం కానున్నాడు.