పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా మరో విజయాన్ని సొంతం చేసుకున్నది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలోనూ గెలుపొందింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 311 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. పది ఓవర్ల వరకు వికెట్పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే 31 బంతుల్లో 13 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తొలి వికెట్గా వెనుతిరిగాడు. కాసేపటికే శుభ్మన్ గిల్ (43), సూర్యకుమార్ వికెట్లను భారత్ కోల్పోయింది. దీంతో 79 రన్స్కు 3 కోల్పోయి కష్టాల్లో పడిన దశలో శ్రేయస్ అయ్యర్ 63), సంజూ శాంసన్ (54) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.
అయితే 40 ఓవర్లలో 212 పరుగులు చేసిన టీమ్ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో నిలిచింది. ఆఖరి 10 ఓర్లలో విజయానికి 100 రన్స్ అవసరమైన దశలో దీపక్ హుడాతో కలిసి అక్షర్ పటేల్ రెచ్చిపోయాడు. ధాటిగా ఆడుతూ వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. హుడా ఔటైనప్పటికీ టెయిలెండర్లతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 64 రన్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అక్షర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అంతకుముందు ఓపెనర్ షై హోప్ (115; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీ చేయడంతో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. నికోలస్ పూరన్ (74; ఒక ఫోర్, 6 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించగా.. కైల్ మయేర్స్ (39), బ్రూక్స్ (35) రాణించారు. పూరన్ రెచ్చిపోవడంతో ఆఖరి 10 ఓవర్లలో విండీస్ 93 పరుగులు పిండుకుంది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్ర పేసర్ అవేశ్ ఖాన్ 6 ఓవర్లలోనే 54 పరుగులు సమర్పించుకున్నాడు.