HomeSportsIndia Beat Malaysia In 7 Goal Thriller To Win Asian Champions Trophy 2023
భారత్ జైత్రయాత్ర
సొంతగడ్డపై జరిగిన ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. అదిరిపోయే ఆటతీరుతో విజేతగా నిలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్ఇండియా 4-3తో మలేషియాను మట్టికరిపించి నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది.
నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కైవసం
ఫైనల్లో మలేషియాపై 4-3తో జయభేరి
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల జట్టు సంచలన ప్రదర్శనతో చాంపియన్గా నిలిచింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో టీమ్ఇండియా 4-3తో మలేషియాను చిత్తు చేసి రికార్డు స్థాయిలో నాలుగోసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆరంభంలో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చి ఒత్తిడిలో కూరుకుపోయిన భారత్.. ద్వితీయార్ధంలో దుమ్మురేపి జయకేతనం ఎగరవేయడం విశేషం.
చెన్నై: సొంతగడ్డపై జరిగిన ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. అదిరిపోయే ఆటతీరుతో విజేతగా నిలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్ఇండియా 4-3తో మలేషియాను మట్టికరిపించి నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఫైనల్లో భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (9వ నిమిషంలో), కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (45వ ని.లో), గుర్జాంత్ సింగ్ (45వ ని.లో), ఆకాశ్దీప్ సింగ్ (56వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. తొలి అర్ధభాగంలో మలేషియా రెచ్చిపోతే.. సెకండ్ హాఫ్లో మనవాళ్లు విజృంభించారు. మలేషియా తరఫున అబు కమల్ అజారి (14వ ని.లో), రాజీ రహీం (18వ ని.లో), మహమ్మద్ అమీనుద్దీన్ (27వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. టోర్నీ ఆసాంతం వీరవిహారం చేసిన టీమ్ఇండియా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మలేషియాకు రజతం దక్కింది.
భారత సారథి హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు దక్కింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, తమిళనాడు సీఎం స్టాలిన్ విజేతలకు బహుమతులు అందించారు. టోర్నీ మొత్తంలో పరాజయం ఎరగకుండా ఫైనల్కు చేరిన టీమ్ఇండియాకు.. తుదిపోరులో మలేషియా నుంచి గట్టిపోటీ ఎదురైంది. మ్యాచ్ ఆరంభంలో జుగ్రాజ్ సింగ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్కు శుభారంభం అందించాడు. అయితే ఆ తర్వాత మలేషియా వరుసగా మూడు గోల్స్ కొట్టి ఆధిపత్యం కనబర్చింది. అబు కమల్ అజారి మలేషియా ఖాతా తెరువగా.. రెండో క్వార్టర్లో రహీం, అమీనుద్దీన్ గోల్స్తో మలేషియా 3-1తో ముందంజలో నిలిచింది. సెకండ్ హాఫ్లో బంతిని ఎక్కువ శాతం తమ ఆధినంలోనే ఉంచుకున్నారు. ఈ క్రమంలో హర్మన్ప్రీత్ , గుర్జాంత్ గోల్స్ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. చివర్లో ఆకాశ్దీప్ గోల్తో భారత్ విజయఢంకా మోగించింది.
ప్లేయర్లకు నజరానా
నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న టీమ్ఇండియాకు తమిళనాడు సీఎం స్టాలిన్ నగదు పురస్కారాలు ప్రకటించారు. జట్టులోని సభ్యులు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు ఇవ్వనున్నారు.