హేమాహేమీలున్న భారత జట్టు.. బంగ్లాదేశ్పై టెస్టు విజయం సాధించేందుకు నానా తంటాలు పడింది. స్వల్ప లక్ష్యఛేదనలో అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి ఆదివారం ఆట కొనసాగించిన టీమ్ఇండియా.. అరగంటలోపే మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. సాధించాల్సిన పరుగులు ఎక్కువ లేకపోయినా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ బాట పడుతుండటంతో ఒక దశలో ఇక పనైపోయినట్లే అనిపించింది. అయితే ఆస్ట్రేలియా పిచ్లపై ఇంతకుమించిన క్లిష్ట పరిస్థితుల్లో అసమాన పోరాటంతో ఆకట్టుకున్న ఆల్రౌండర్ అశ్విన్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. సహచరులు నిలబడేందుకు ప్రయాస పడుతున్న చోట శ్రేయస్తో కలిసి అలవోకగా భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్తో పాటు సిరీస్ను భారత్ ఖాతాలో వేశాడు.
మీర్పూర్: భారత క్రికెట్ జట్టు ఈ ఏడాదిని విజయంతో ముగించింది. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయి నిరాశ పరిచిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన రెండో టెస్టులో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. 145 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 45/4తో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన రాహుల్ సేన.. ఆరంభంలో తడబడ్డా చివరకు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రవిచంద్రన్ అశ్విన్ (42 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. అక్షర్ పటేల్ (34) పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు పడగొట్టగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 6 వికెట్లు తీయడంతో పాటు.. క్లిష్ట సమయంలో 42 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. రెండు టెస్టుల్లో కలిపి 222 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. ఒక దశలో 74/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్నైట్ బ్యాటర్ అక్షర్ పటేల్ కుదురుకునేందుకు ప్రయత్నించగా.. నాలుగో రోజు రెండో ఓవర్లోనే ఉనాద్కట్ (13; ఒక సిక్సర్) ఔటయ్యాడు. ఆదుకుంటాడనుకున్న రిషబ్ పంత్ (9) ఒక్క ఫోర్కే పరిమితం కాగా.. కాసేపటికే అక్షర్ కూడా వెనుదిరిగాడు. ఇంకేముందు ఇక భారత్ గెలువడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. శ్రేయస్తో కలిసి అశ్విన్ ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్ల పరీక్షను తట్టుకుంటూ.. క్రీజులో నిలదొక్కుకున్న అశ్విన్ ఆ తర్వాత ఎదురుదాడి మంత్రంతో పరుగులు రాబట్టాడు. ఈ దశలో మరో వికెట్ పడితే భారత్ టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో పరాజయం పాలయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో ఈ జోడీ మొదట ఆచితూచి ఆడింది. ఒక దశలో 12 ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా నమోదు కాలేదంటే ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కొంత స్కోరే కొండంతై భయపెడుతున్న వేళ.. కొన్ని చక్కటి షాట్లతో శ్రేయస్ ఒత్తిడిని దూరం చేయగా.. ఎడాపెడా బౌండ్రీలతో అశ్విన్ మ్యాచ్ను ముగించాడు. చివరాఖరికి విజయం టీమ్ఇండియాదే అయినా.. 145 పరుగులతోనే భారత్కు ముచ్చమటలు పట్టించిన బంగ్లాదేశ్ ప్లేయర్లు తమ పోరాటంతో ఆకట్టుకున్నారు.
బంగ్లా తొలి ఇన్నింగ్స్: 227,
భారత్ తొలి ఇన్నింగ్స్: 314,
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 231,
భారత్ రెండో ఇన్నింగ్స్: 145/7 ( అశ్విన్ 42 నాటౌట్, అక్షర్ 34; మెహదీ 5/63, షకీబ్ 2/50)