Vikram Rathour : వైజాగ్, రాజ్కోట్ టెస్టు విజయాలతో జోరుమీదున్న టీమిండియా(Team India) నాలుగో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. శుక్రవారం రాంచీ(Ranchi) వేదికగా జరిగే నాలుగో మ్యాచ్లోనే సిరీస్ పట్టేయాలనే లక్ష్యంతో వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే రాంచీలో స్పిన్ పిచ్(Spin Pitch) సిద్దం చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) సైతం ఆ పిచ్ను చూసి షాక్ అయ్యాడు. అలాంటి పిచ్ను తాను ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ (Vikram Rathour) పిచ్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాంచీ పిచ్ ఎప్పుడు టర్న్ అవుతుంది? ఎంత మేరకు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది? అనేది మాత్రం చెప్పలేనని అన్నాడు. ‘భారత్లో ఆడిన ప్రతిసారి పిచ్లపై ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇదొకటి సాధారణ భారత పిచ్. అయితే.. కొన్ని పగుళ్లు ఉన్నాయి. కచ్చితంగా బంతి టర్న్ అవుతుంది. కానీ, ఎంత టర్న్ అవుతుంది? ఏ రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను’ అని విక్రమ్ వెల్లడించాడు.
రాంచీ పిచ్
ఒకవేళ విక్రమ్ రాథోర్ చెప్పినట్టే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే.. స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) స్థానంలో మరో పేసర్ను ఆడిస్తారా? స్పిన్నర్ను తీసుకుంటారా? అనేది చూడాలి. ఇప్పటికే జట్టులో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బుమ్రా ప్లేస్లో స్పిన్ చాయిస్గా అక్షర్ పటేల్ను ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్కు కూడా యంగ్ స్పిన్ త్రయం ఉంది. టామ్ హర్ట్లే, రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్లు చక్కగా రాణిస్తున్నారు.
పైగా ఆ జట్టులోని ఓలీ పోప్, జూ రూట్, స్టోక్స్, బెయిర్స్టోలు స్పిన్ చక్కగా ఆడగలరు. దాంతో, రాంచీ పిచ్ స్పిన్కు అనుకూలిస్తే.. ఇరుజట్ల మధ్య తగ్గపోరు జరగడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతానికి 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు.. స్టోక్స్ సేన చెక్ పెడుతుందా? లేదా? చాపచుట్టేస్తుందా అనేది రేపటితో తేలిపోనుంది.