ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ పోటీల తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆకాంక్షలు మోసుకుంటూ పారిస్ గడ్డపై అడుగుపెట్టిన భారత బృందం పతక సాధన దిశగా తొలి అడుగు వేసింది. శనివారం వేర్వేరు విభాగాల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మహిళల 10మీటర్ల ఎయిర్పిస్టల్లో మను భాకర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
చెక్కుచెదరని గురితో ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ భాకర్ పతక వేటలో ముందంజ వేసింది. బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్తో పాటు సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీ బోణీ కొట్టారు. తమకంటే తక్కువ ర్యాంక్ ప్రత్యర్థులపై అలవోక విజయం సాధించారు. హాకీలో న్యూజిలాండ్పై భారత్ విజయదుందుభి మోగించింది. ఆఖర్లో హర్మన్ప్రీత్సింగ్ గోల్తో టీమ్ఇండియా గెలుపు వాకిట నిలిచింది.
Paris Olympics | పారిస్: కోటి ఆశలతో కొంగొత్త లక్ష్యాలతో పారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు పతక సాధన దిశగా దూసుకెళుతున్నారు. తమపై పెట్టుకున్న ఆశలను వమ్ముచేయకుండా ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం జరిగిన షూటింగ్ మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్టార్ షూటర్ మను భాకర్ సత్తాచాటింది. గత ఒలింపిక్స్లో ఘోరంగా నిరాశపరిచిన మను ఈసారి ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా లక్ష్యంపై గురిపెడుతూ పాయింట్లు కొల్లగొట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 580 పాయింట్లు దక్కించుకున్న మను భాకర్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. వైజే కిమ్(కొరియా), తర్హాన్(టర్కీ), జి లీ(చైనా)తో కలిసి భాకర్ ఫైనల్ పోరులో తలపడనుంది. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ స్టార్ షూటర్ మెరిస్తే..ఒలింపిక్స్ షూటింగ్లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుంది. మరోవైపు పురుషుల విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లో సరబ్జ్యోత్సింగ్ 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి తృటిలో ఫైనల్ బెర్తు కోల్పోయాడు. మరోవైపు 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు నిరాశపరిచారు. అర్జున్ బబుతా-రమిత జోడీతో పాటు సందీప్సింగ్- ఎలావెనిల్ వాలరివన్ ద్వయం ఫైనల్ బెర్తు దక్కించుకోలేకపోయింది.
రెపిచేజ్లో పన్వర్: పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్లో బల్రాజ్ పన్వర్ రెపిచేజ్ రౌండ్కు అర్హత సాధించాడు. మహిళల 54కిలోల తొలి రౌండ్లో భారత యువ బాక్సర్ ప్రీతి పవార్ 5-0 తేడాతో వో తి కిమ్ అన్హ్ (వియత్నాం)పై గెలిచింది.
ఒలింపిక్స్ హాకీలో ఘన చరిత్రకు చిరునామా అయిన భారత్..పారిస్లో అదిరిపోయే ఆరంభం చేసింది. తమ తొలి పోరులో టీమ్ఇండియా 3-2తో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్సింగ్(24ని), వివేక్సాగర్(34ని), హర్మన్ప్రీత్సింగ్(59ని) గోల్స్ చేశారు. మరోవైపు సామ్లేన్(8ని), సైమన్ చైల్డ్(53ని) కివీస్కు గోల్స్ అందించారు. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ స్ట్రోక్ను హర్మన్ప్రీత్సింగ్ గోల్గా మలిచి భారత్కు విజయాన్నందించాడు.
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-8, 22-20తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై అలవోక విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనలిస్టు అయిన కార్డన్పై లక్ష్యసేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆది నుంచే జోరు కనబరుస్తూ వరుస గేముల్లో కార్డన్ను చిత్తుచేశాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీ 21-17, 21-14తో ఫ్రాన్స్ ద్వయం కార్వీ, లాబర్పై అలవోక గెలిచి ముం దంజ వేశారు. మహిళల డబుల్స్లో అశ్విని, తనీషా జోడీ పోరాటం ము గిసింది.
చారిత్రక సీన్ నదిని వేదికగా చేసుకుంటూ సాగిన పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై విమర్శల జడివాన కురుస్తున్నది. తమదేశ ఘనమైన వారసత్వాన్ని చూపించే క్రమంలో ఫ్రాన్స్ నవ్వులపాలైంది. వెస్ట్రన్ సివిలైజేషన్ను పూర్తిగా ఎగతాళి చేస్తూ రూపొందించిన డ్రాగ్-క్వీన్ థీమ్తో కూడిన కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మ్యారీ అంటోనెటి తన తలను చేతిలో పట్టుకున్నట్లు కనిపిస్తున్న వీడియోతో పాటు విచిత్రమైన మేకప్, భారీ కాయం ఉన్న మహిళ ధరించిన దుస్తులు, లియోనార్డీ డావిన్సి ‘ద లాస్ట్ సప్పర్’ వేషధారణ, ఏసుక్రీస్తుపై పేయిటింగ్పై నిర్వాహకులు.. సోషల్మీడియాలో భారీగా ట్రోలింగ్కు గురయ్యారు.
పురుషుల టేబుల్టెన్నిస్లో హర్మీత్దేశాయ్ ఆకట్టుకున్నాడు. సింగిల్స్ పోరులో హర్మీత్ 11-7, 11-9, 11-5, 11-5తో జైద్ అమో యమన్(జోర్డాన్)పై ఘన విజయం సాధించాడు. పురుషుల టెన్నిస్ డబుల్స్లో భారత ద్వయం బాలాజీ, రోహన్ బోపన్న పోరు ఆదివారానికి వాయిదా పడింది.