న్యూఢిల్లీ: ఈనెల చివర్లో చెంగ్డు (చైనా) వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ ఫైనల్స్ కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. ఉబర్ కప్ నుంచి స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు మహిళల డబుల్స్లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్, తనిషా క్రాస్టో- అశ్విని పొన్నప్ప పోటీ నుంచి తప్పుకున్నారు. ఆగస్టులో పారిస్లో జరుగనున్న ఒలింపిక్స్ సన్నాహకాల్లో ఉన్న సింధు.. సెలక్షన్స్కు దూరంగా ఉండగా మిగిలిన షట్లర్లు విశ్వక్రీడల్లో అర్హత సాధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉబర్కప్ టోర్నీకి దూరంగా ఉన్నారు. వీరి స్థానాల్లో అన్మోల్ ఖర్బ్, అష్మిత చాలిహ, తన్వీశర్మకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఈ ముగ్గురూ కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఆసియా టీమ్ చాంపియన్షిప్స్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఉబర్ కప్లో భారత్ ఇంతవరకూ ఫైనల్ చేరలేదు. 1957, 2014, 2016లో సెమీస్ చేరడమే ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శన.
పటిష్ఠమైన జట్టుతో థామస్కప్ లోకి..
థామస్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. గతేడాది ఇండోనేషియాను 3-0 తో ఓడించిన భారత్ చరిత్ర సృష్టించింది. పది మంది ఆటగాళ్లతో (వీరిలో ఐదుగురు సింగిల్స్ ప్లేయర్లు) బరిలోకి దిగనుంది. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సత్తా చాటాలని భావిస్తున్నారు.