న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి ఢిల్లీ ఆటగాడు యశ్ ధుల్ సారథ్యం వహించనుండగా.. ఆంధ్ర ప్లేయర్ ఎస్కే రషీద్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరుగనున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా.. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండాతో కలిసి భారత్ గ్రూప్-‘బి’లో ఉంది. ఈ నెల 23 నుంచి యూఏఈలో జరుగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం ప్రస్తుతం యువ భారత జట్టు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ అనంతరం మన కుర్రాళ్లు విండీస్కు పయనం కానున్నారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాదీ పేసర్ రిషిత్ రెడ్డికి.. ప్రపంచకప్ స్టాండ్బై జాబితాలో చోటు దక్కింది.
భారత అండర్-19 జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), హర్నూర్ సింగ్, రఘువంశీ, ఎస్కే రషీద్, నిశాంత్, సిద్ధార్థ్ యాదవ్, గౌతమ్, దినేశ్, ఆరాధ్య యాదవ్, రాజ్ అంగద్, మానవ్ పరాఖ్, కౌశల్ తాంబే, హంగార్జెకర్, వాసు, విక్కీ ఓస్తాల్, రవి కుమార్, గర్వ్ సాంగ్వాన్
స్టాండ్ బై: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహరన్, అన్ష్ గోశాయ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్, సింగ్ రాథోడ్.