ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. తుది జట్టులో చోటు కోసం పది మంది ప్లేయర్లు పోటీపడుతున్న జట్టు ఓ వైపు..! జీతాల కోత, కరోనా కేసులు, గాయాల బెడద, క్రమశిక్షణ రాహిత్యంతో తుది జట్టు ఎంపికే గగనమైన టీమ్ మరోవైపు..! దిగ్గజ మార్గదర్శకుడి దిశానిర్దేశంలో ఫుల్ జోష్లో ఉన్న జట్టు ఓవైపు..! నాలుగేండ్లలో పదో కెప్టెన్ను మార్చి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న టీమ్ మరోవైపు..! ఇలా రెండు భిన్న స్థితుల్లో ఉన్న జట్ల మధ్య వన్డే సిరీస్కు నేడు తెరలేవనుంది. ఐపీఎల్ హీరోస్తో కళకళలాడుతున్న ధావన్ సేన.. సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. మరి గబ్బర్ గ్యాంగ్ను లంకేయులు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి!
కొలంబో: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమ్ఇండియా ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ కోసం కసరత్తులు చేస్తుంటే.. ధావన్ సారథ్యంలోని భారత జట్టు లంకను జయించేందుకు రెడీ అయింది. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో పరిమిత ఓవర్ల సిరీస్ల్లో సత్తాచాటి జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం భారత్, లంక మధ్య తొలి వన్డే జరుగనుంది. ప్రధాన ప్లేయర్లు అందుబాటులో లేకున్నా.. రాహుల్ ద్రవిడ్ కోచింగ్లో ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లతో టీమ్ఇండియా పటిష్ఠంగా కనిపిస్తుంటే.. నిబంధనల ఉల్లంఘన, కరోనా కేసులు, గాయాల బెడద ఇలా లంక జట్టు సమస్యలతో సతమతమవుతున్నది. కెప్టెన్ ధావన్తో పాటు పృథ్వీ షా ఓపెనింగ్ చేయనుండగా.. సూర్యకుమార్, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. ఆల్రౌండర్ల కోటాలో పాండ్యా బ్రదర్స్.. హార్దిక్, కృనాల్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం కాగా.. కుల్చా జోడీ కుల్దీప్, చాహల్ కలిసి బరిలోకి దిగుతారా చూడాలి. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ కూడా జట్టులో ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. ఇక భువనేశ్వర్తో పాటు సైనీ, దీపక్ చాహర్లలో ఒకరు పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.