కొరుకుడు పడని కంగారూలను ఆస్ట్రేలియాలోనే ఒకటికి రెండు సార్లు మట్టికరిపించిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాలో మాత్రం సత్తాచాటలేకపోయింది! మూడు దశాబ్దాల్లో ఎనిమిదిసార్లు అక్కడ పర్యటించినా.. ఒక్కటంటే ఒక్కసారి కూడా సిరీస్ గెలువలేకపోయాం! ఇంగ్లండ్లో ఇంగ్లిష్ టీమ్ను చిత్తు చేయడం.. న్యూజిలాండ్లో కివీస్ను పడగొట్టడం ఇలా ఎన్ని ఘనతలు సాధించినా.. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ విజయం భారత్ను ఊరిస్తూనే ఉంది! సారథులు మారినా.. ప్లేయర్లు మారినా.. ఫలితం మాత్రం మారలేదు. మరి రోహిత్ కెప్టెన్సీలో బాక్సింగ్ డే టెస్టుతో సిరీస్ ప్రారంభించనున్న టీమ్ఇండియా ఈసారి చరిత్ర తిరగరాస్తుందాచూడాలి!!
IND Vs SA Test | సెంచూరియన్: దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను సమం చేసుకొని.. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇప్పుడు అసలు సిసలు సమరానికి సమాయత్తమైంది. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు మంగళవారం తెరలేవనుంది. పేస్కు సహకరించే సెంచూరియన్లో ఇరుజట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1992 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 31 ఏండ్లలో 8 సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీమ్ఇండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలువలేకపోయింది. ఒకే ఒక్కసారి సిరీస్ ‘డ్రా’ చేసుకొని మిగిలిన ఏడుసార్లు ప్రత్యర్థికి కప్పు అప్పజెప్పింది. ఈ సారి ఆ లెక్కలు సరిచేయాలనే ఉద్దేశంతో భారత జట్టు ఉంటే.. అజేయ రికార్డు కొనసాగించాలని ప్రొటీస్ రెడీ అవుతున్నారు.
గత పర్యటనలో పటిష్ట జట్టుతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. తొలి మ్యాచ్ నెగ్గి ఆశలు రేపినా.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయింది. ఈ ఫలితం అనంతరమే విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు ఈ టూర్ పరీక్ష కానుంది. పేస్తో పాటు అదనపు బౌన్స్తో అనూహ్యంగా స్పందించే సఫారీ పిచ్లపై అటు సారథిగా.. ఇటు బ్యాటర్గా రోహిత్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం కానుంది. స్టార్ బ్యాటర్ కోహ్లీకి దక్షిణాఫ్రికాలో మంచి రికార్డు ఉంది. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడే అత్యుత్తమ ఆటతీరు కనబర్చే కోహ్లీ సఫారీ గడ్డపై 50కి పైగా సగటుతో పరుగులు రాబట్టాడు. ఇప్పుడు సారథ్య బాధ్యతలు లేకపోయినా.. మిడిలార్డర్లో అన్నీ తానై వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం పలు సిరీస్ల నుంచి విశ్రాంతి తీసుకున్న సీనియర్ ప్లేయర్లు ఈ సిరీస్లో బరిలోకి దిగనున్నారు.
రివర్స్ స్వింగ్, బౌన్స్తో భయపెట్టే దక్షిణాఫ్రికా పిచ్లు ప్లేయర్ల సహనాన్ని పరీక్షించడం సహజమే. క్రీజులో కుదురుకోకుండా అడ్డదిడ్డంగా ఆడే ప్రయత్నం చేస్తే.. వికెట్ సమర్పించుకోవడం పక్కా! అందుకే సఫారీ పర్యటన ఆటగాడి నైపుణ్యానికి సవాలు వంటిదని విశ్లేషకులు అభిప్రాయపడతారు. టెస్టు స్పెషలిస్టులు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా లేకుండా భారత జట్టు ఈ సిరీస్ ఆడనుంది. వారిద్దరి టెస్టు అరంగేట్రం తర్వాత (2006 నుంచి) సఫారీ పర్యటనలో వాళ్లు లేకుండా భారత జట్టు టెస్టులు ఆడలేదు. టెక్నిక్ పరంగా అత్యుత్తమ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన ఈ ఇద్దరు గత పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. ఆ తర్వాత కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫలితంగా వారికి జట్టులో చోటు దక్కలేదు.
గత టూర్తో పోల్చుకుంటే ఈ సారి పలువురు కొత్త ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. రోహిత్తో కలిసి యశస్వి ఇన్నింగ్స్ను ఆరభించనుండగా.. వన్డౌన్లో గిల్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రాహుల్, శ్రేయస్, జడేజా బ్యాటింగ్కు రానున్నారు. టెస్టు క్రికెట్లోనూ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనుండటంతో మరో అదనపు బ్యాటర్ను ఆడించే చాన్స్ దక్కినైట్లెంది. అయితే దక్షిణాఫ్రికా జట్టులో రబడ, ఎంగ్డీ, కోట్జీ వంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు ఉండటంతో యువ ఆటగాళ్లు వారిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో రెండో స్పిన్నర్ అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు అవకాశం దక్కొచ్చు. ఇక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ గాయపడటంతో ముఖేశ్, ప్రసిద్ధ్లో ఒకరికి తుది జట్టులో చాన్స్ దక్కనుంది. బుమ్రా, సిరాజ్పై బాధ్యత ఎక్కువ ఉండనుంది.
దక్షిణాఫ్రికాలోని పిచ్లలోనే సెంచూరియన్ వేగవంతమైంది. ఆటకు తొలి రెండు రోజులు వర్షం ముప్పు పొంచి ఉంది. అంటే బౌలర్లకు మరింత సహకారం లభించే అవకాశాలున్నాయి. ఇక్కడ ఆడిన 28 టెస్టుల్లో 22 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. గత పర్యటనలో భారత్ సాధించిన ఏకైక విజయం ఇక్కడే నమోదైంది.
భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, కోహ్లీ, రాహుల్, శ్రేయస్, జడేజా, శార్దూల్/అశ్విన్, బుమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), ఎల్గర్, మార్క్మ్,్ర జోర్జి, కీగన్, కైల్ వెరీనె, మార్కో జాన్సన్, కేశవ్, కోట్జీ, రబడ, ఎంగ్డీ.