మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య చివరిదైన ఐదో టెస్ట్ కొవిడ్ కారణంగా రద్దయింది. ఇండియన్ క్యాంప్లో కరోనా కలకలం రేపడంతో ప్లేయర్స్ ఎవరూ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేరంటూ ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. సరే.. మరి ఈ ఐదు టెస్ట్ల సిరీస్ ఫలితం ఏంటి? ముగిసిన నాలుగు టెస్టుల్లో ఇండియా 2-1 లీడ్లో ఉంది. ఆ లెక్కన ఇండియా సిరీస్ గెలిచినట్లా? లేక ఇండియా చివరి మ్యాచ్ ఆడటానికి నిరాకరించింది కాబట్టి 2-2తో డ్రా అయిందా? అసలే ఇది వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న సిరీస్ కావడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తిగా మారింది.
నిర్ణయం ఎవరిది?
ప్రస్తుతం ఈ సిరీస్పై నిర్ణయం తీసుకునేది ఐసీసీనే. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ అభిప్రాయం మేరకు ఐసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న సిరీస్ కావడం ఇండియాకు కాస్త కలిసొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీని రూల్స్ ప్రకారం.. ఓ టీమ్లో కొవిడ్ కేసు బయటపడితే మ్యాచ్ను రద్దు చేయవచ్చు. మ్యాచ్ రద్దు అంటే.. సిరీస్ 2-1తో ఇండియా వశమైనట్లే.
నిజానికి నాలుగో టెస్ట్ సందర్భంగానే కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లు భరత్ అరుణ్, శ్రీధర్లు కొవిడ్ బారిన పడ్డారు. అయినా ఐదో టెస్ట్ జరపాలని రెండు బోర్డులు భావించాయి. కానీ బుధవారం ఇండియన్ క్యాంప్లోని ఫిజియో కూడా కొవిడ్ బారిన పడటంతో ఈ మ్యాచ్ నిర్వహణపై మరోసారి ఈసీబీతో బీసీసీఐ చర్చిస్తోంది. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహంలో ఇండియన్ టీమ్ రెండు రోజులుగా గందరగోళానికి గురవుతోంది. అయితే నిజానికి టీమ్ ఈ నెల 15న ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లాల్సి ఉన్నా.. అంతకన్నా ముందే సిద్ధంగా ఉండాలని బీసీసీఐ ప్లేయర్స్ను కోరినట్లు సమాచారం.
గందరగోళ మెసేజ్లు
శుక్రవారం ఉదయం కూడా మ్యాచ్ రద్దయిందని, ఎవరి గదుల్లో వాళ్లు ఉండాలని ప్లేయర్స్కు మేనేజ్మెంట్ మెసేజ్లు పంపించింది. పది నిమిషాల గ్యాప్లోనే బ్రేక్ఫాస్ట్ రూమ్స్లోకి పంపించడం కుదరడం లేదు.. రెస్టారెంట్లకు వెళ్లాలనుకున్న వాళ్లు వెళ్లొచ్చు అని మరో మెసేజ్ పంపడంతో ప్లేయర్స్ అందరూ గందరగోళానికి గురయ్యారు.
మ్యాచ్ రీషెడ్యూల్పై బీసీసీఐ చర్చలు
అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయడానికి ఈసీబీతో చర్చిస్తోంది బీసీసీఐ. అదే జరిగితే ఈ సిరీస్ ఇంకా ముగియనట్లే. ఈసీబీతో బీసీసీఐకి మంచి సంబంధాలు ఉండటంతో.. ఈ రద్దయిన మ్యాచ్ను మళ్లీ నిర్వహించే అంశంపై రెండు బోర్డులు చర్చిస్తున్నాయి అని బోర్డు వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది టీ20, వన్డే సిరీస్ కోసం టీమిండియా మళ్లీ ఇంగ్లండ్ వస్తోంది. మరి అప్పుడు ఈ టెస్ట్ ఏమైనా ఆడతారా అన్నది చూడాలి.