విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్కు.. సూర్యకుమార్ యాదవ్ ఊరమాస్ దంచుడు తోడవడంతో టీమ్ఇండియా ఆసియకప్ సూపర్-4కు దూసుకెళ్లింది. బుధవారం పోరులో వీరిద్దరు పరుగుల సునామీ సృష్టించడంతో రోహిత్ సేన 40 పరుగుల తేడాతో హాంకాంగ్ను చిత్తుచేసింది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించిన టీమ్ఇండియా.. హాంకాంగ్తో పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది.
దుబాయ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రికెట్ జట్టు.. ఆసియా కప్ టీ20 టోర్నీలో సూపర్-4 దశకు చేరింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమ్ఇండియా 40 పరుగుల తేడాతో హాంకాంగ్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. చాన్నాళ్ల తర్వాత విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 59 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్ (36), రోహిత్ శర్మ (21) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
అనంతరం లక్ష్యఛేదనలో హాంకాంగ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. బాబర్ హయత్ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో భువనేశ్వర్, అర్శ్దీప్, రవీంద్ర జడేజా, అవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లలో హాంకాంగ్ బౌలర్లను ఊచకోత కోసిన సూర్యకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
భారత్, పాక్కు జరిమానా
ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో.. ఇరు జట్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడంతో రిఫరీ ఇరు జట్ల ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 40 శాతం కోత విధించారు.
హార్దిక్ @ 3
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరులో అటు బంతితో, ఇటు బ్యాట్తో విజృంభించిన హార్దిక్ పాండ్యా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో హవా కనబర్చాడు. ఆల్రౌండర్ విభాగంలో ఎనిమిది స్థానాలు మెరుగు పర్చుకొని కెరీర్ అత్యుత్తమ ఐదో ర్యాంక్కు చేరాడు. బ్యాటింగ్లో భారత్ నుంచి అత్యుత్తమంగా సూర్య మూడో స్థానంలో ఉన్నాడు.