టాపార్డర్ విఫలం కావడంతో సునాయాసంగా గెలువాల్సిన మ్యాచ్ను టీమ్ఇండియా కష్టతరంగా మార్చుకుంది. మన బౌలర్లు సత్తాచాటినా.. బంగ్లా చివరి వరస బ్యాటర్లు పోరాటంతో ఆతిథ్య జట్టు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగా.. 145 పరుగుల ఛేదనలో భారత్ 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో ఆదివారం మనవాళ్లు వంద పరుగులు చేస్తారా.. లేక ఆతిథ్య బంగ్లా ఆరు వికెట్లు పడగొడుతుందా అనేది ఆసక్తికరం!
మీర్పూర్: భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న టీమ్ఇండియాకు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది. 145 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. శుభ్మన్ గిల్ (7), చతేశ్వర్ పుజారా (6), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) ఆకట్టుకోలేకపోయారు.
బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ మూడు, షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు. చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్ విజయానికి ఇంకా వంద పరుగుల దూరంలో ఉంది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (26; 3 ఫోర్లు)తో పాటు నైట్వాచ్మన్ జైదేవ్ ఉనాద్కట్ (3) క్రీజులో ఉన్నాడు. తొలి రెండు రోజుల ఆటలో ఆధిపత్యం కనబర్చిన భారత్.. మూడో రోజు చివరి సెషన్లో ఘోరంగా తడబడింది. 23 ఓవర్లలో 45 పరుగులే చేసి 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 7/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌటైంది. లిటన్దాస్ (73), జాకిర్ హసన్ (51) అర్ధశతకాలు సాధించగా.. ఆఖర్లో నూరుల్ హసన్ (31), తస్కీన్ అహ్మద్ (31 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ప్రధాన బ్యాటర్లు ఔటైనా.. చివరి వరుస ఆటగాళ్లతో కలిసి లిటన్దాస్ లీడ్ పెంచుతూ పోయాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్, ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
పిచ్ పేసర్లకు సహకరిస్తుందని భావించిన కెప్టెన్ రాహుల్.. గత టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి ఉనాద్కట్ను జట్టులోకి తీసుకోగా.. ఇప్పుడా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా రెండో ఇన్నింగ్స్లో అదనపు స్పిన్నర్ కొరత స్పష్టంగా కనిపించింది. పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న చోట బంగ్లా చివరి నాలుగు జోడీలు 118 పరుగులు సాధించగా.. పుష్కర కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఉనాద్కట్ 9 ఓవర్లకే పరిమితమయ్యాడు.
సులభతరమైన లక్ష్యఛేదనలో భారత టాపార్డర్ తడబడింది. పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న మాట వాస్తవమే అయినా.. మరీ భయపెట్టే విధంగా లేదని బంగ్లా బ్యాటర్లు అప్పటికే నిరూపించిన చోట మనవాళ్లు ఆడటమే సాధ్యం కానట్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని స్టాండిన్ సారథి రాహుల్ మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. కాసేపటికే చతేశ్వర్ పుజారా స్టంపౌట్ కాగా.. శుభ్మన్ గిల్ అతడిని అనుసరించాడు. ఆదుకుంటాడనుకున్న కింగ్ కోహ్లీ.. 22 బంతులాడి ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం అక్షర్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్ క్రీజులో ఉండగా.. తొలి ఇన్నింగ్స్ హీరోలు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్తో పాటు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ మైదానంలో రెండు సార్లు (209, 205) మాత్రమే ఇంతకన్న ఎక్కువ లక్ష్యఛేదన సాధ్యమైంది. నాలుగో రోజు తొలి గంట ఎలా సాగుతుందనేది కీలకం.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 227,
భారత్ తొలి ఇన్నింగ్స్: 314,
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 231 (లిటన్దాస్ 73, జాకిర్ 51; అక్షర్ 3/68, సిరాజ్ 2/41), భారత్ రెండో ఇన్నింగ్స్: 23 ఓవర్లలో 45/4 (అక్షర్ పటేల్ 26 బ్యాటింగ్; మెహదీ హసన్ 3/12).