భారత్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో శ్రీలంక జట్టుకు ఓదార్పు విజయం లభించింది. తొలి రెండు టీ20లను సునాయాసంగా గెలిచిన భారత జట్టు మూడో మ్యాచ్లో తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (39 నాటౌట్), స్మృతి మంధాన (22), సబ్బినేని మేఘన (22), జెమీమా రోడ్రిగెజ్ (33) రాణించారు.
ఓపెనర్ షెఫాలీ వర్మ (5) మరోసారి విఫలమవగా.. ఇన్నింగ్స్ చివరి బంతికి పూజా వస్త్రాకర్ (13) రనౌట్ అయింది. ఈ క్రమంలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక సారధి చమారి ఆటపట్టు (48 బంతుల్లో 80 నాటౌట్) చెలరేగడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఆమెకు నీలాక్షి డి సిల్వ (30) నుంచి మంచి సహకారం అందింది.
దీంతో రెచ్చిపోయిన ఆటపట్టు ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో 17 ఓవర్లలోనే 141 పరుగులు చేసిన శ్రీలంక జట్టు విజయతీరాలకు చేరింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ ఓడినా కూడా మూడు మ్యాచుల సిరీస్ మాత్రం 2-1తో భారత్ వశం చేసుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా చమారి ఆటపట్టు నిలవగా.. సిరీస్ ఆద్యంతం రాణించిన భారత సారధి హర్మన్ప్రీత్ కౌర్ ‘‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’’ అవార్డు అందుకుంది. ఇప్పటి వరకు భారత్తో ఆడిన 12 టీ20 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక.. ఎట్టకేలకు విజయం నమోదు చేయడం గమనార్హం.