Virat Kohli | రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. క్లాసిక్ సెంచరీతో విజృంభించడంతో టీమ్ఇండియా దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు లేని వర్షంలా.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సింగిల్స్తోనే కరీబియన్లకు విసిగెత్తించాడు. చాపకింద నీరులా ఒక్కో పరుగు జోడించుకుంటూ వెళ్లిన విరాట్.. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ను అద్భుత సెంచరీతో మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. కోహ్లీ యాంకర్ రోల్కు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సహకారం తోడవడంతో విండీస్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మైలురాయి మ్యాచ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీకి ఇది 500వ మ్యాచ్ కాగా.. దీన్ని విరాట్ శతకంతో మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 76వ సెంచరీ కాగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. విదేశీ గడ్డపై 2018 తర్వాత కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో వారికన్, రోచ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
గత మ్యాచ్లో ఖాతా తెరిచేందుకు తీవ్రంగా శ్రమించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ఈ సారి సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తూ.. 4 ఫోర్లు అరుసుకున్నాడు. కోహ్లీ ఔటైన కాసేపటికే… జడేజాకూడా వెనుదిరగగా.. అశ్విన్తో కలిసి ఇషాన్ ముందుకు సాగాడు. మరో ఎండ్లో అశ్విన్ చక్కటి స్ట్రోక్ ప్లేతో పాటు.. అద్భుత డిఫెన్స్తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా వికెట్లు పడుతున్న భారత్ పరుగుల ప్రవాహం కొనసాగింది. ఇదే జోరులో టీమ్ఇండియా 400 మార్క్ దాటగా.. అశ్విన్కు కాసేపు సహకరించిన జైదేవ్ ఉనాద్కట్ (7) ఔటయ్యాడు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ (0)తో పాటు, అరంగేట్ర ఆటగాడు ముఖేశ్ కుమార్ (0 నాటౌట్) బ్యాట్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
ఓవర్నైట్ స్కోరు 288/4తో రెండో రోజు గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజులో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అదే జోరు కొనసాగించాడు. తొలి రోజు రెండో సెషన్లో కాస్త ప్రభావం చూపిన విండీస్ బౌలర్లు.. కోహ్లీ మొక్కవోని దీక్ష ముందు సాగిలపడ్డారు. అడ్డ దిడ్డ షాట్లకు పోని కోహ్లీ.. అచ్చమైన టెస్టు క్రికెటింగ్ షాట్లతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఒక్కో పరుగు జోడిస్తూ.. స్కోరును పెంచాడు అతడికి లెఫ్ట్ హ్యాండర్ రవీంద్ర జడేజా చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో విరాట్ 180 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. కాసేపటికే జడేజా అర్ధశతకం చేసి బ్యాట్ సాముతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు కరీబియన్ ఫీల్డర్లు ప్రేక్షకుల్లా మారారు. ఐదో వికెట్కు 159 పరుగులు జోడించిన అనంతరం లేని పరుగుకు ప్రయత్నించి కోహ్లీ రనౌటయ్యాడు. స్వైర్ లెగ్ వైపు బంతిని ఆడిన కోహ్లీ తొలుత పరుగు తీయాలనుకున్నా.. మధ్యలో కాస్త ఆలోచించాడు. ఆలోపు నాన్ స్ట్రయికింగ్లో ఉన్న జడేజా పరుగు అందుకునేసరికి విరాట్ తప్పక రన్ పూర్తి చేయాల్సి వచ్చింది. అదే సమయంలో బంతిని చేజిక్కించుకున్న జోసెఫ్ నేరుగా వికెట్లకు గిరాటేశాడు. దీంతో గీతకు కాస్త దూరంగా ఉండిపోయిన కోహ్లీ.. బాధగా పెవిలియన్ బాటపట్టాడు.