మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు. 19వ ఓవర్ వేసిన అశ్విన్ లాహిరు తిరుమనే (17)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. అశ్విన్ వేసిన బంతి బాగా టర్న్ అవుతుందనుకొని తిరుమనే ఆడాడు. కానీ లైట్గా స్లైడ్ అయిన బంతి అతని బ్యాట్ను తప్పించుకొని ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుటివ్వడంతో కాసేపు ఆలోచించిన తిరిమనే రివ్యూ కోరాడు. అయినా ఫలితం మారకపోవడంతో లంకేయులు తొలి వికెట్ కోల్పోయారు. ఆ తర్వాత 25వ ఓవర్ రెండో బంతికి జడేజా మాయ చేశాడు.
జడ్డూ వేసిన క్వికర్ బాల్ను డిఫెండ్ చేయడానికి కరుణరత్నే (28) ప్రయత్నించాడు. అయితే బాగా టర్న్ అయిన బంతి అతని ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుట్గా ప్రకటించాడు. అయితే లైన్ ఆవల బంతి పడిందని అనుకున్న కరుణరత్నే రివ్యూ కోరాడు. అతని అంచనా కరెక్టేకానీ వెంట్రుక వాసిలో తప్పింది. దాన్ని అంపైర్ కాల్గా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. దాంతో కరుణరత్నే వెనుతిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం క్రీజులో ఏంజెలో మాథ్యూస్, పాథుమ్ నిస్సంక ఉన్నారు.